Chiranjeevi | సినిమా డెస్క్/హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): మాజీ ఉప రాష్ట్రపతి, పద్మవిభూషణ్ ఎం వెంకయ్యనాయుడిని పద్మవిభూషణ్, సినీ నటుడు చిరంజీవి ఆత్మీయంగా సత్కరించారు. శుక్రవారం హైదరాబాద్లోని వెంకయ్యనాయుడు నివాసంలో కలిసి అభినందనలు తెలిపారు. శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు. దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారం వరించిన తరుణంలో ఒకరికొకరు పరస్పర అభినందనలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. ‘నేను ఎప్పుడూ అంటుంటాను. తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్టీరామారావు, అక్కినేని నాగేశ్వరరావు రెండు నేత్రాలు అయితే చిరంజీవి మూడోనేత్రం. ఆయన త్రినేత్రుడు. చిరంజీవి పద్మవిభూషణ్ పురస్కారానికి పూర్తిగా అర్హుడు. సరైన సమయంలో భారత ప్రభుత్వం ఆయనకు సముచిత గౌరవం ఇచ్చింది. చిరంజీవిని చూస్తే నాకు చాలా గర్వంగా ఉన్నది’ అన్నారు.
అనంతరం చిరంజీవి మాట్లాడుతూ.. ‘పెద్దలు, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అంటే నాకు అపారమైన గౌరవం. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు ఆయన పిలుపుతో ‘జై ఆంధ్ర’ ఉద్యమంలో పాల్గొన్నా. పార్లమెంటులోనూ మేం కొలీగ్స్. ఆయన ప్రతి ఎదుగుదలను గమనిస్తూ ఉన్నాను. చాలా విషయాల్లో ఆయనే నాకు స్ఫూర్తి. ముఖ్యంగా తనను తాను మలుచుకుంటూ రాజకీయాల్లో స్వయంకృషితో తెలుగువారు గర్వించే స్థాయికి చేరుకున్నారు. ఆయన్ను పద్మవిభూషణ్ అవార్డుతో భారత ప్రభుత్వం సత్కరించడం, గౌరవించడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. మరీ ముఖ్యంగా ఆయనతోపాటు నాకూ పద్మవిభూషణ్ రావడం మరింత ఆనందాన్నిచ్చింది’ అని తెలిపారు.
భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మ విభూషణ్ అవార్డును దేశంలోని రైతులు, యువత, మహిళలు సహా నవభారత నిర్మాణంలో భాగస్వాములు అవుతున్న ప్రతి ఒక్కరికీ అంకితం చేస్తున్నానని మాజీ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ప్రకటించారు. అమృత కాలం దిశగా దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నదని తెలిపారు. ప్రస్తుత తరుణంలో భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మ విభూషణ్ పురస్కారాన్ని వినమ్రంగా స్వీకరిస్తున్నానని చెప్పారు. ఈ పురస్కారం తన బాధ్యతను మరింతగా పెంచిందని పేర్కొన్నారు. శక్తివంతమైన, ఆత్మనిర్భర భారత నిర్మాణానికి ప్రజలతో కలిసి నడుస్తానని వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్ఠాత్మక పద్మ విభూషణ్ అవార్డుకు ఎంపికైన మాజీ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, ప్రముఖ సినీ నటుడు చిరంజీవికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం ఎక్స్ వేదికగా ఆయన అభినందనలు తెలిపారు. వీరితోపాటు రాష్ట్రం నుంచి పద్మ శ్రీ అవార్డుకు ఎంపికైన ప్రముఖ చిందు యక్షగానం కళాకారుడు గడ్డం సమ్మయ్య, బుర్ర వీణ కళాకారుడు దాసరి కొండప్ప, వేలు ఆనంద చారి, కేతావత్ సోమ్లాల్, కూరెళ్ల విఠలాచార్యకు శుభాభినందనలు తెలిపారు. వెంకయ్యనాయుడు, చిరంజీవితో పాటు ఉమామహేశ్వరికి బీఆర్ఎస్ ఏపీ శాఖ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ శుభాకాంక్షలు తెలిపారు.