Trisha Krishnan | హీరోయిన్ త్రిష కృష్ణన్కు అన్నాడీఎంకే మాజీ నేత ఏవీ రాజు క్షమాపణలు తెలిపారు. ఇటీవల ఆయన త్రిషపై అభ్యంతర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై సినీ, రాజకీయ నాయకులతో పలువురు ప్రముఖులు మండిపడ్డారు. ఈ క్రమంలో ఆయన క్షమాపణలు చెబుతూ.. తన ప్రకటనను తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. నటిపై అలాంటి వ్యాఖ్యలు చేయడం తన ఉద్దేశం కాదన్నారు. అలాగే, దర్శకుడు చరణ్, నటుడు కరుణాదాస్తో పలువురికి క్షమాపణలు చెబుతున్నానని.. ఎవరి మనోభావాలు దెబ్బతిన్నట్లయితే క్షమించాలని కోరారు.
అన్నాడీఎంకే తమిళనాడు ఏఐఏడీఎంకే నేత ఏవీ రాజుకీ, అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యే జీ వెంకటాచలానికి మధ్య వివాదం కొనసాగుతున్నది. ఈ క్రమంలో ఏవీ రాజు.. వెంకటాచలాన్ని ఉద్దేశించి విమర్శలు చేస్తూ మధ్యలో హీరోయిన్ త్రిష కృష్ణన్ పేరును ప్రస్తావించాడు. అంతటితో ఆగకుండా ఆమె వ్యక్తిగత జీవితంపై సంచలన కామెంట్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైర్ అయ్యింది. దీనిపై త్రిష సైతం మండిపడింది. ప్రజల దృష్టిని ఆకర్షించడానికి ఏ స్థాయికైనా దిగజారగల ఇలాంటి నీచమైన మనుషులను మళ్లీ మళ్లీ చూడడం మరింత ఘోరంగా ఉందంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించింది.
తన ఓపిక నశించిందని.. ఇక అలాంటి వ్యక్తులను క్షమించననని.. వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఎవరు మాట్లాడినా లీగల్ డిపార్ట్మెంట్ నుంచే సమాధానం వస్తందంటూ హెచ్చరించింది. ఏవీ రాజు వ్యాఖ్యలపై పలువురు సినీ తారలు మండిపడ్డారు. హీరో విశాల్ సైతం రాజకీయ నేత వ్యాఖ్యలను ఖండించారు. ఇక త్రిష సినిమాల విషయానికి వస్తే చివరిసారిగా ‘లియో’ చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం ఐదు సినిమాల్లో నటిస్తున్నది. విదా ముయార్చి చిత్రంలో అజిత్తో జతకట్టబోతున్నది. మోహన్లాల్ లీడ్లో తెరకెక్కనున్న రామ్, ఐడెంటిటీ, థగ్ లైఫ్ చిత్రాలతో పాటు మెగాస్టార్ హీరోగా తెరక్కెతున్న విశ్వంభర చిత్రంలోనూ కనిపించబోతున్నది. దాదాపు 18 సంవత్సరాల తర్వాత చిరుతో జంటగా నటిస్తున్నది.