కరోనా కష్టంలో ఎన్పీడీసీఎల్ చర్యలు
బిల్ రీడింగ్ కోసం ప్రత్యేక యాప్
క్లిక్ చేస్తే కట్టాల్సిన బిల్లు వస్తుంది
వరంగల్ సబర్బన్, మే 6:ప్రస్తుతం కరోనా విలయతాండవం చేస్తున్నది. ప్రజలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఇంటి పరిసరాల్లోకి బయటి వ్యక్తి వస్తే అనుమానంగా చూస్తున్న పరిస్థితి. ఇటువంటి సందర్భంలో ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్) ప్రత్యేక చర్యలకు ఉపక్రమించింది. ప్రధానంగా ప్రతినెలా విద్యుత్ మీటర్ల బిల్లులు నమోదు చేయడం కష్టంగా మారింది. ఇప్పటికే విద్యుత్ మీటర్ రీడింగ్ చూసే సిబ్బంది కొందరు కరోనా బారినపడ్డారు. అంతేగాక రీడింగ్ కోసం వచ్చే వారితోనూ ఇంటి పట్టు ఉంటున్న వినియోగదారులకు కరోనా అంటుకునే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో వినియోగదారులే రీడింగ్ తీసేలా ఎన్పీడీసీఎల్ సీఎండీ అన్నమనేని గోపాల్రావు సదుపాయం కల్పించారు.
మీటర్ రీడింగ్ మీరే తీయవచ్చు..
ఎ3,211 హైటెన్షన్(హెచ్ టీ) మీటర్లతో కలిపి మొత్తం 61లక్షల 77వేల 230 విద్యుత్ మీటర్లు ఉన్నా యి. ఇందులో 15 లక్షల 2వేల 974 వ్యవసాయ, హెచ్టీ విద్యుత్ కనెక్షన్లు మినహాయిస్తే మిగతా 60 లక్షల 51వేల 467 విద్యుత్ మీటర్లకు ప్రతినెలా స్పా ట్ బిల్లింగ్ సిబ్బంది వెళ్లి రీడింగ్ నమోదు చేయాల్సి ఉంటుంది. నమోదు చేసిన తర్వాత వినియోగదారుడు సమీప ఈఆర్వోలో క్యూలో నిల్చుని బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. గ్రామాల్లో అయితే గ్రామ పంచాయతీ కార్యాలయం వద్దకు వెళ్లి బిల్లు కట్టాలి. ఈ ప్రక్రియలో అనేక మందికి కరోనా భయం పొంచి ఉంది. ఇందుకోసం వినియోగదారులు సులభంగా ఇంటి మీటరు బిల్లును తామే రీడింగ్ తీసుకొని ఆన్లైన్లోనే చెల్లించేలా ఎన్పీడీసీఎల్ పేరుతో ప్రత్యేకంగా యాప్ను రూపొందించింది.
యాప్ ఎలా పని చేస్తుందంటే..
ప్లేస్టోర్ నుంచి టీఎస్ఎన్పీడీసీఎల్ ఐటీ వింగ్ డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ను ఓపెన్ చేసి అందులో సెల్ఫ్ రీడింగ్పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత సబ్ సెల్ఫ్ రీడింగ్ను ఎంచుకుని వినియోగదారుని యూనిక్ సర్వీస్ నంబర్ ఎంటర్ చేసిన కన్ఫర్మ్ బటన్ నొక్కాలి. ఆ తర్వాత ఫోన్ నంబర్ ఎంటర్ చేసి కేడబ్ల్యూహెచ్పై క్లిక్ చేసి మీటర్ లోపల ఉండే కేడబ్ల్యూహెచ్ రీడింగ్ను స్కాన్ చేసే సమయంలో ‘భారత్ సెల్ఫ్ మీటర్ రీడింగ్’ యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత సబ్మిట్ నొక్కితే మీరు ఈ నెలలో వినియోగించుకున్న బిల్లు మెస్సేజ్ రూపంలో వస్తుంది. ఈ బిల్లును ఆన్లైన్లో చెల్లించుకుంటే సరిపోతుంది. ప్రస్తుతానికైతే ఈ సెల్ఫ్ రీడింగ్ విధానం కరోనా తీవ్రంగా ఉన్న ఈ నెలలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత పరిశీలిస్తారు. సెల్ఫ్ రీడింగ్ తీసుకోకుంటే స్పాట్ బిల్లింగ్ కార్మికులు కూడా వచ్చి రీడింగ్ తీస్తారు.
ఆన్లైన్ చెల్లింపులే మేలు
కరోనా నేపథ్యంలో ఆయా కార్యాలయాలకు వెళ్లి బిల్లులు చెల్లించడం కంటే ఆన్లైన్ చెల్లింపులే మేలని సీఎండీ గోపాల్ రావు సూచిస్తున్నారు. ఎన్పీడీసీఎల్ వెబ్సైట్ ద్వారా గాని పేటీఎం, ఫోన్ పే, బిల్ డెస్క్, ఎన్పీడీసీఎల్ యాప్ ద్వారా గాని సులభంగా చెల్లించవచ్చు.
డైరెక్టర్లతో సీఎండీ ప్రత్యేక సమావేశం
ఎన్పీడీసీఎల్ పరిధిలోని 17 జిల్లాలో తీసుకుంటున్న కరోనా జాగ్రత్త చర్యలను సీఎండీ అన్నమనేని గోపాల్రావు సంస్థ డైరెక్టర్లకు విద్యుత్భవన్లో బుధవారం వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా ఉధృతి తీవ్రంగా ఉన్న దృష్ట్యా విద్యుత్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు ప్రభుత్వ సూచనలు పాటించాలన్నారు. ఈ కీలక సమయంలో విద్యుత్రంగంలో అంతరాయాలు లేకుండా పనులు పూర్తి చేయాలని సూచించారు. కార్పొరేట్ కార్యాలయంతో పాటు సర్కిల్, డివిజన్ కార్యాలయాల్లో 24 గంటల పాటు నిరంతరంగా పనిచేసేందుకు హెల్ప్లైన్లు ఏర్పాటుచేశామని చెప్పారు. విద్యుత్ సమస్యలు ఉన్నట్లయితే 1800 425 0028, 1912 టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేయాలని కోరారు.