Krishnam Raju | రెబల్ స్టార్ కృష్ణంరాజు పేరిట అరుదైన రికార్డు ఉన్నది. కేంద్ర మంత్రిగా పనిచేసిన తొలి నటుడిగా కృష్ణంరాజు రికార్డులకెక్కారు. కృష్ణం రాజు సినిమాల్లో నటిస్తూనే రాజకీయరంగ ప్రవేశం చేశారు. 1991లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదే ఏడాదిలో నర్సాపురం లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూపతిరాజు విజయకుమార్ రాజు చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత కొద్దికాలంపాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 1998 ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీలో చేరారు. కాకినాడ లోక్సభ స్థానం నుంచి పోటీచేసి విజయం సాధించి లోక్సభలో అడుగుపెట్టారు. అయితే ఆ విజయం ఎక్కువ కాలం నిలువలేదు.
అప్పటి ప్రధాని అటల్ బిహారి వాజ్పేయీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మద్దతు ఉపసంహరించుకున్నారు. దీంతో 1999లో మధ్యంతర ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈసారి నర్సాపురం లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కనుమూరి బాపిరాజుపై మంచి మెజారిటీతో గెలుపొందారు. మాజీ ప్రధాని వాజ్పేయి హయాంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. 2004లో జరిగిన ఎన్నికల్లో అదేస్థానం నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి జోగయ్య చేతిలో పరాజయం పాలయ్యారు. మార్చి 2009లో భారతీయ జనతా పార్టీని వీడి చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ తర్వాత 2014లో మరోసారి బీజేపీలో చేరారు.