కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ తొలి దశ ఎన్నికల్లో భాగంగా 30 నియోజకవర్గాలకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. పుర్బా మేదినిపూర్ జిల్లాలోని సత్సాతామల్ నియోజకవర్గంలో ఓ పోలింగ్ కేంద్రం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు భద్రతా సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిద్దరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఓటర్లను భయపెట్టేందుకు బీజేపీ కార్యకర్తలే కాల్పులకు తెగబడుతున్నారని తృణమూల్ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. పోలింగ్ కేంద్రాలను తమ ఆధీనంలోకి తీసుకుని బీజేపీ అభ్యర్థులకే ఓటు వేయించేలా ఆ పార్టీ కార్యకర్తలు యత్నిస్తున్నారని పేర్కొన్నారు. టీఎంసీ నేతలు కావాలని తమపై ఆరోపణలు చేస్తున్నారని, వారే ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు అనూప్ చక్రవర్తి తెలిపారు.
మందకొడిగా పోలింగ్
తొలి రెండు గంటల్లో 30 నియోజకవర్గాల్లో 8 శాతం పోలింగ్ నమోదైంది. బెంగాల్లో తొలిదశ పోలింగ్ కోసం 7,061 పోలింగ్ స్టేషన్లు, 10,288 పోలింగ్ బూత్లు ఏర్పాటుచేశారు. 73,80,942 మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. అస్సాంలో 1,917 పోలింగ్ కేంద్రాల్లో 11,537 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. 81.09 లక్షల మంది ఓటేయనున్నారు.