సినీ నేపథ్య గాయకుడు వడ్డేపల్లి శ్రీనివాస్ సికింద్రాబాద్ చిలకలగూడ లోని ఆయన స్వగృహంలో గురువారం కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ‘గబ్బర్ సింగ్’ సినిమాలో ‘పిల్లా నువ్వులేని జీవితం’ పాటతో ఎంతో పేరు తెచ్చుకున్నాడు. అంతే కాకుండా ‘కింగ్’ సినిమాలో ‘గింత గింత బాల చుకవే’ అనే పాట పాడి అనేక మంది హృదయాలను గెలుచుకున్నాడు. వడేపల్లి శ్రీనివాస్. అనేక జానపద గేయాలు, వేల స్టేజీ ప్రోగ్రాంలు చేసి నంది అవార్డుతో పాటూ ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఆయన వరంగల్ జిల్లాలో జన్మించారు.
చిన్నప్పుడే హైదరాబాద్కు వచ్చి తెలంగాణలో గొప్ప జానపద కళాకారుడిగా పేరు తెచ్చుకున్నాడు. ‘నమస్తే అన్న’ చిత్రంలో సుద్దాల అశోక్ తేజ రాసిన ‘గరం గరం పోరీ నా గజ్జెల సవ్వారీ’ అనే పాట ద్వారా సినీ నేపథ్య గాయకుడిగా పరిచయయ్యాడు. అనేక ప్రైవేట్ ఆల్బమ్స్లలో ఆయన పాడిన జానపద గీతాలు విశేష ఆదరణ పొందాయి. ఆయనకు భార్య, కూతురు ఉన్నారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. గురువారం సాయంత్రం అంత్యక్రియలు సీతాఫల్మండి హిందూ శ్మశాన వాటికలో జరిగాయి. అంత్యక్రియలకు సంగీత దర్శకులు విష్ణు కిషోర్, జానపద కవి గాయకుడు నేర్నాల కిషోర్, గాయని స్వర్ణక ,గాయకుడు బోనాల ప్రకాష్ , కళాకారుడు సంపత్ , గాయకురాలు మల్లిక అనేకమంది కళాకారులు హాజరై సంతాపం తెలిపారు.