బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ పలకరింపు కోసం ప్రతీ ఆదివారం ముంబయిలోని ఆయన స్వగృహం జల్సా వద్ద వందలాది అభిమానులు ఎదురుచూస్తుంటారు. తన ఇంటి బాల్కనీలో కొద్ది సేపు నిల్చొని అభిమానులకు అభివాదం చేసి వెళ్లి పోతారు అమితాబ్ బచ్చన్. ఈ ఆనవాయితీని ఆయన ఎన్నో ఏళ్లుగా కొనసాగిస్తున్నారు. ఆ సమయంలో ఆయన పాదరక్షలు ధరించరు. దీని వెనకున్న కారణాన్ని వివరిస్తూ సోషల్మీడియాలో ఓ పోస్ట్ చేశారు అమితాబ్ బచ్చన్. ‘గుడికి వెళ్లినప్పుడు మనం చెప్పులను బయటే విడిచివెళ్తాం కదా…ప్రతీ ఆదివారం నా ఇంటి ప్రాంగణం నాకు ఓ దేవాలయంలా కనిపిస్తుంది.
అభిమానులు దేవుళ్ల మాదిరిగా దర్శనమిస్తారు. అందుకే వారికి అభివాదం చేసే సమయంలో పాదరక్షలు అస్సలు ధరించను. యాభై ఏళ్లుగా నేను అదే సంప్రదాయాన్ని పాటిస్తున్నా’ అని అమితాబ్ బచ్చన్ తెలిపారు. ఒకవేళ తాను ఏ కారణం చేతనైనా ఆదివారం అందుబాటులో లేకపోతే రెండు మూడు రోజుల ముందుగానే ఆ విషయాన్ని తెలియజేస్తానని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ తెలుగులో ‘ప్రాజెక్ట్-కె’ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ షూటింగ్లో ఆయన గాయపడిన విషయం తెలిసిందే. కొద్దిరోజులు ఇంటి వద్దే చికిత్స తీసుకొని కోలుకున్న అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం ‘సెక్షన్ 84’ చిత్రీకరణలో పాల్గొంటున్నారు.