హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): సినీ నటుడు నవదీప్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు పది గంటలపాటు ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలుస్తున్నది. ప్రధానంగా మనీల్యాండరింగ్పైనే దృష్టి సారించిన అధికారులు.. తన అకౌంట్ల నుంచి ఎవరెవరికి ఎంత డబ్బు పంపారు? అనే అంశంపైనే ఎక్కువ ప్రశ్నలు అడిగినట్టు విశ్వసనీయ సమాచారం. 2017 టాలీవుడ్ డ్రగ్స్ కేసు, ఇటీవల పట్టుబడిన మాదాపూర్ డ్రగ్స్ కేసులో మంగళవారం ఈడీ అధికారుల ఎదుట నవదీప్ విచారణకు హాజరయ్యాడు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని ఈడీ కార్యాలయానికి చేరుకున్న నవదీప్ను రాత్రి 8 గంటల వరకు ప్రశ్నించారు. నవదీప్ నుంచి బ్యాంకు ఖాతాల స్టేట్మెంట్లు తీసుకున్న అధికారులు.. అతను జరిపిన లావాదేవీలపై ఎక్కువ ఫోకస్ చేసినట్టు తెలిసింది.
గతంలో నవదీప్ నిర్వహించిన పబ్ వివరాలు, దాని ద్వారా జరిపిన లావాదేవీలపై కూడా ఈడీ అధికారులు ప్రశ్నలు సంధించారు. అతని ప్రొడక్షన్హౌస్, దాని బ్యాంకు ఖాతాలపై విచారించినట్టు తెలిసింది. ఈ విచారణలో నవదీప్ అకౌంట్ నుంచి కొందరు నైజీరియన్ల అకౌంట్కు డబ్బులు ట్రాన్స్ఫర్ అయినట్టు అధికారులు గుర్తించారు. నైజీరియన్లతో నవదీప్ ఎప్పటి నుంచి స్నేహం చేస్తున్నారనే విషయాలపై కూడా ప్రశ్నించినట్టు తెలిసింది. విదేశీ డ్రగ్ పెడ్లర్స్తో నవదీప్కు ఉన్న సంబంధాలపై కూడా ప్రశ్నలు అడిగినట్టు సమాచారం. సినీ ఇండస్ట్రీలో ఎవరెవరు డ్రగ్స్ తీసుకుంటున్నారనే అంశాన్ని పదే పదే ప్రస్తావించినట్టు తెలిసింది. ఈ విషయంపై నవదీప్ నోరుమెదపలేని సమాచారం. ఇదే విషయంలో మరోమారు విచారణకు పిలిస్తే హాజరుకావాలని, అందుబాటులో ఉండాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఆదేశించినట్టు తెలిసింది.