హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణకు హీరో తరుణ్ బుధవారం హాజరయ్యారు. ఉదయం ఈడీ కార్యాలయానికి తన బ్యాంకు ఖాతాల వివరాలతో వచ్చిన తరుణ్ను ఈడీ అధికారులు దాదాపు ఏడు గంటలపాటు ప్రశ్నించారు. బ్యాంకు ఖాతాల వివరాలు తీసుకున్నారు. 2017లో ఎక్సైజ్శాఖ నమోదు చేసిన కేసులోనూ తరుణ్ విచారణ ఎదుర్కొన్నారు. తాను డ్రగ్స్ వాడలేదని ధీమాగా చెప్పిన తరుణ్ తన గోళ్లు, వెంట్రుకలు, రక్త నమూనాలు సైతం పరీక్షల కోసం ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే తరుణ్ డ్రగ్స్ వాడినట్టు ఎఫ్ఎస్ఎల్ నివేదికలో తేలలేదని కూడా ఎక్సైజ్శాఖ కోర్టుకు సమర్పించిన చార్జిషీట్లో పేర్కొంది. ఎక్సైజ్శాఖ విచారణలో క్లీన్చిట్ వచ్చిన తరుణ్ను ఈడీ అధికారులు పలు కీలక అంశాలపై ప్రశ్నించినట్టు తెలిసింది. పబ్ల నిర్వహణ, పార్టీలు, సినీ తారలతో పరిచయాలు…వీకెండ్పార్టీలు, డ్రగ్ సరఫరాదారుడు కెల్విన్, ఈవెంట్ మేనేజర్ జీషాన్అలీలతో పరిచయం…వారితో ఏవైనా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా?..ఇలా పలు కీలక అంశాలపైనా ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు తరుణ్ సమాధానమిచ్చినట్టు తెలిసింది. విచారణ అనంతరం తరుణ్తో మాట్లాడేందుకు మీడియా ప్రతినిధులు ప్రయత్నించినా తరుణ్ కారులో ఎక్కి వెళ్లిపోయారు. గత నెల 31న ప్రారంభమైన ఈడీ విచారణ సుదీర్ఘంగా కొనసాగింది. మొత్తం 12 మంది సినీ ప్రముఖులకు ఈడీ సమన్లు జారీ చేయడంతో కొన్నికొన్ని రోజుల వ్యవధితో వారందరినీ ప్రశ్నించడం..కేసులో కీలకంగా ఉన్న కెల్విన్ను, జీషాన్ అలీలను సైతం వారితో కలిపి విచారించడం వంటి అనేక ఆసక్తికర మలుపులతో ఈడీ దర్యాప్తు కొనసాగింది. అయితే ఈ దర్యాప్తు 12 మందితోనే సరిపెడతారా?..వీరి నుంచి సేకరించిన అంశాల మేరకు ఇంకెవరికైనా సమన్లు జారీ చేసే అవకాశం ఉందా?..అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.