హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): తన పేరును కొందరు రాజకీయంగా వాడుకుంటున్నారని ప్రముఖ సినీనటుడు మోహన్బాబు అన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ లేఖను విడుదల చేశారు. ఈ మధ్య తన పేరును రాజకీయంగా కొందరు ఉపయోగించుకుంటున్నట్టు తన దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. దయచేసి ఏ పార్టీ వారైనా తన పేరును వారి స్వప్రయోజనాల కోసం వాడుకోవద్దని విజ్ఞప్తి చేశారు.
మనం అనేక భావావేశాలున్న వ్యక్తుల ప్రపంచంలో జీవిస్తున్నామని, ఎవరి అభిప్రాయాలు వారివని, అది వ్యక్తిగతమని పేర్కొన్నారు. చేతనైతే నలుగురికి సాయపడడంపైనే దృష్టిపెట్టాలని గానీ సంబంధం లేనివారిని రాజకీయ పార్టీల్లోకి, వారి అనుబంధ సంస్థల్లోకి తీసుకురావడం బాధాకరమని తెలిపారు. ఈ విషయాలను ఉల్లంఘించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని లేఖలో హెచ్చరించిన ఆయన ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ చేశారన్నది మాత్రం చెప్పలేదు.