చెన్నై: తమిళ నటుడు, డీఎండీకే అధినేత కెప్టెన్ విజయకాంత్ (Vijayakanth) కన్నుమూశారు. శ్వాస సంబంధిత సమస్యతో చెన్నైలోని మియోట్ దవాఖానలో చేరారు. పరీక్షల్లో ఆయనకు కొవిడ్ నిర్ధారణ అయింది. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించినప్పటికీ లాభం లేకుండా పోయింది. పరిస్థితి విషమించడంతో విజయకాంత్ తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు తమిళనాడు ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రకటించారు.
71 ఏండ్ల విజయకాంత్ ఏడాది కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గత నెల 18న జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలతో చెన్నైలోని మియోట్ దవాఖానలో చేరారు. చికిత్స అనంతరం కోలుకుని డిసెంబర్ 11న ఇంటికి చేరుకున్నారు. అయితే అప్పుడే ఆయన మరణించారనే వార్తలు నెట్టింట షికారు చేశాయి. అయితే ఆ వదంతులను ఆయన సతీమణి ప్రేమలత కొట్టిపారేశారు. అయితే రెండు వారాలు గడువకముందే ఆయన కొవిడ్ బారినపడటం, మరోసారి శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తడంతో గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. తమిళ సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన విజయకాంత్.. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లో సైతం అడుగుపెట్టారు. 2005లో డీఎండీకే పార్టీని స్థాపించారు.
Official medical bulletin from Chennai MIOT hospital announcing the passing away of Captain #Vijayakanth #RIPCaptain pic.twitter.com/yLynSrBj9I
— Ramesh Bala (@rameshlaus) December 28, 2023