ప్రకటించిన మంత్రి కేటీఆర్
ఫలించిన ఎమ్మెల్యే చందర్ కృషి
నియోజకవర్గ ప్రజల హర్షం
గోదావరిఖని, జూన్ 10 :పెద్దపల్లి జిల్లా సిగలో మరో నగ చేరబోతున్నది. మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పేరొందిన రామ గుండం పారిశ్రామిక ప్రాంతంలో ఐటీ టవర్ నిర్మాణం కాబోతున్నది. ఈ మేరకు హై దరాబాద్లో జరిగిన ఓ కార్యక్రమం వేదికగా మంత్రి కేటీఆర్ ప్రకటించగా, ఎమ్మెల్యే చందర్ కొద్దిరోజులుగా చేస్తున్న ప్రయత్నం ఫలించింది. ఐటీ టవర్ ఏర్పాటుతో ఈ ప్రాంత యువతకు ఎంతో మేలు జరుగనుండగా, నియోజకవర్గ ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నది.
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఐటీ టవర్ రాబోతున్నది. అందుకు స్వయానా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం హైదరాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రకటించడంతో ఈ ప్రాంతవాసుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. కొంత కాలంగా వివిధ పరిశ్రమలకు నిలయంగా ఉన్న రామగుండంలో ఐటీ టవర్ ఏర్పాటు చేయాలంటూ స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పలుమార్లు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ను కలిసి విన్నవించగా, ఆయన ప్రయత్నం ఫలించింది. ఈ ప్రాంత యువత ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేకుండా ఇక్కడే ఐటీ ఉద్యోగం చేసుకునే అవకాశం దొరకనున్నది.
నిరుద్యోగుల వరం..
సింగరేణి, ఎన్టీపీసీ, కేశోరాం, జెన్కో లాంటి భారీ పరిశ్రమలు కలిగిన పారిశ్రామిక ప్రాంతంలో ఉద్యోగుల పిల్లలు చాలా మంది ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారే ఉంటారు. వీరి చదువులకు అనుగుణంగా స్థానికంగా ఐటీ ఉద్యోగాలు లేకపోవడంతో హైదరాబాద్, బెంగుళూరు, పూణె తదితర నగరాలకు వెళ్తుంటారు. అలాగే ఇంకా మరికొందరు విదేశాలకు వెళ్లి కొలువులు చేస్తుంటారు. అనేక భారీ పరిశ్రమలున్న ఈ ప్రాంతంలో స్థిరపడిన అధికారులు, ఉద్యోగులు చాలా మంది ఐటీ విద్యకే ప్రాధాన్యత ఇస్తూ తమ పిల్లలను ఇతర ప్రాంతాలకే పంపిస్తుంటారు. ఈ నేపథ్యంలో రా మగుండంలోనే ఐటీ టవర్ నిర్మిస్తే స్థానికంగానే ఉద్యోగాలు కల్పించుకోవచ్చన్న ఉద్దేశంతో గతం లో ప్రజాప్రతినిధులు ఆలోచన చేసినప్పటికీ అనుకూలించలేదు. కానీ ఎమ్మెల్యే చందర్ పట్టువిడువకుండా కొద్దిరోజులుగా సీఎం కేసీఆర్, ఐటీ మం త్రి కేటీఆర్ను కలిసి విన్నవిస్తూ వస్తున్నారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్లో జరిగిన ఒక సెమినార్ వేదికపై ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రా ష్ట్రంలో పలు జిల్లాలో ఐటీ టవర్లు ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. అందులో రా మగుండం పేరు కూడా ప్రకటించడంతో ఇక్కడి ప్రజ లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సంతోషంగా ఉంది: ఎమ్మెల్యే కోరుకంటి
ఈ ప్రాంత పరిస్థితులు, తమ విన్నపాన్ని గొప్ప మనసుతో అర్థం చేసుకొని ఐటీ టవర్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న మంత్రి కేటీఆర్కు నియోజక వర్గ ప్రజల తరపున ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కృతజ్ఞతలు తెలిపారు. నిరుద్యోగుల జీవితాల్లో త్వరలోనే వెలుగులు చూడబోతున్నందుకు చాలా సంతృప్తిగా ఉందని పేర్కొన్నారు.