సినిమాలకు సామాజిక ప్రయోజనంతో పాటు ప్రజాహితం పరమార్థంగా ఉండాలని విశ్వసించే దర్శకుల్లో ఎన్.శంకర్ ఒకరు. వాణిజ్య అంశాలు కలబోసిన స్ఫూర్తివంతమైన కథాంశాలతో తెలుగు చిత్రసీమపై తనదైన ముద్రను వేశారాయన. తాజాగా ఆయన చారిత్రక ఘటనలతో మూడు వెబ్సిరీస్లను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎన్.శంకర్ టీవీ అండ్ ఫిల్మ్ స్టూడియో పతాకంపై ఆయన నిర్మాతగా, దర్శకత్వ పర్యవేక్షణలో ఈ సిరీస్లు రూపొందనున్నాయి. ఈ సిరీస్లకు సంబంధించిన వివరాలను ఎన్.శంకర్ తెలియజేస్తూ ‘తెలంగాణ సాయుధ పోరాటం నుంచి తెలంగాణ రాష్ట్ర సాకారం వరకు చోటుచేసుకున్న చారిత్రక ఘటనలు, జరిగిన ప్రజా ఉద్యమాల నేపథ్యంలో తొలి సిరీస్ను తెరకెక్కిస్తాం. అక్టోబర్లో షూటింగ్ను మొదలుపెడతాం.
ఇక రెండవ సిరీస్లో సామాజిక ఉద్యమకారుడు మహాత్మ జ్యోతిరావు పూలే జీవితంలో జరిగిన సంఘటనలు, అణగారిన ప్రజల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటాన్ని చూపించబోతున్నాం. భారత రాజ్యాంగ శిల్పి బాబా సాహెబ్ అంబేద్కర్ జీవిత సంఘర్షణ, సమాజంలోని అసమానతలను రూపుమాపడానికి ఆయన చేసిన కృషిని దృశ్యమానం చేస్తూ మూడో వెబ్సిరీస్ను రూపొందించబోతున్నాం’ అని తెలిపారు. అయితే మహాత్మ జ్యోతిరావు పూలే, బాబా సాహెబ్ అంబేద్కర్ వెబ్సిరీస్లు బయోగ్రఫీలు కాదని, లక్ష్య సాధనలో వారి స్ఫూర్తిదాయక పోరాటాన్ని ఆవిష్కరిస్తాయని, ఈ మూడు వెబ్సిరీస్లను తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కిస్తామని ఎన్.శంకర్ తెలిపారు.