దక్షిణాది చిత్రసీమలో ప్రతిభాంతులైన దర్శకుల్లో లోకేష్ కనకరాజ్ ఒకరు. కేవలం ఐదేళ్ల సమయంలో దేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యారు. 2017లో ‘మానగరం’ ద్వారా దర్శకుడిగా పరిచయమైన లోకేష్ కనకరాజ్ ఖైదీ, మాస్టర్, విక్రమ్ చిత్రాలతో అగ్రశ్రేణి దర్శకుడిగా ఎదిగారు. లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ను మొదలుపెట్టి మాఫియా, పోలీస్ బ్యాక్డ్రాప్లో వినూత్న చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. అయితే ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో లోకేష్ కనకరాజ్ ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించారు.
సుదీర్ఘమైన ప్రణాళికలతో తాను ఇండస్ట్రీలోకి రాలేదని, హాలీవుడ్ దర్శకుడు క్వింటెన్ టరెంటీనో మాదిరిగా పది చిత్రాలను డైరెక్ట్ చేసి సినీరంగం నుంచి తప్పుకుంటానని తెలిపారు. ‘నాకు నచ్చిన కథలను చెప్పాలనే ఇక్కడకు వచ్చా. తొలుత షార్ట్ఫిల్మ్స్ ద్వారా నా టాలెంట్ను నిరూపించుకున్నా. పది సినిమాలు మాత్రమే చేయాలనుకుంటున్నా. ఆ తర్వాత ఇండస్ట్రీకి గుడ్బై చెబుతా’ అని లోకేష్ కనకరాజ్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన విజయ్ కథానాయకుడిగా ‘లియో’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే కశ్మీర్లో భారీ షెడ్యూల్ పూర్తయింది.