‘మనందరం రాంబో, టెర్మినేటర్ వంటి యాక్షన్ చిత్రాలను బాగా ఎంజాయ్ చేస్తాం. ఆ తరహా కథకు సందేశం కలబోసి యాక్షన్ డ్రామాగా ‘ఈగల్’ చిత్రాన్ని తెరకెక్కించాం’ అన్నారు కార్తీక్ ఘట్టమనేని. ఆయన దర్శకత్వంలో రవితేజ కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ‘ఈగల్’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకురానుంది.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని గురువారం పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘ఈ చిత్రాన్ని లార్జర్ దేన్ లైఫ్ కథాంశంతో రూపొందించాం. హీరో రవితేజ పత్తి పండించే రైతులా కనిపిస్తాడు. అతని పోరాటం మాత్రం అంతర్జాతీయ స్థాయిలో ఉంటుంది. అదేమిటన్నదే సినిమాలో ఆసక్తికరమైన అంశం’ అన్నారు. టైటిల్ గురించి చెబుతూ ‘ఈగల్ నాలుగు కిలోమీటర్ల ఎత్తులో కూడా కింద ఉన్న కుందేలును చూడగలుగుతుంది.
హీరో క్యారెక్టర్లో అలాంటి పవర్ ఉంటుంది. సినిమాలో హీరో అసలు పేరు సహదేవ్ వర్మ. అతన్ని ఈగల్ అనే కోడ్ నేమ్తో పిలుస్తుంటారు’ అని తెలిపారు. ఈ సినిమాలో నవదీప్ క్యారెక్టర్ సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్తో ఉంటుందని, అనుపమ పరమేశ్వరన్ పాత్ర కథాగమనంలో కీలకంగా ఉంటుందని పేర్కొన్నారు. ‘ైక్లెమాక్స్ యాక్షన్ ఘట్టాలను రాత్రివేళలో 17 రోజుల పాటు షూట్ చేశాం. ఇక ఈ సినిమా సౌండ్ డిజైన్ కోసం ఆరు నెలల పాటు వర్క్ చేశాం. యూరప్లో రియల్ గన్స్తో షూట్ చేసి ఆ సౌండ్స్ను రికార్డ్ చేశాం. ప్రస్తుతం తేజ సజ్జాతో ఓ సినిమా చేస్తున్నా. త్వరలో ఆ వివరాలు తెలియజేస్తా’ అన్నారు కార్తీక్ ఘట్టమనేని.