కళలు, సంప్రదాయాల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్కున్న అభిమానం, అభిరుచికి నిదర్శనమే యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణం అని ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు గుణశేఖర్ అన్నారు. ‘శాకుంతలం’ సినిమా విడుదల నేపథ్యంలో తన కూతురు నిర్మాత నీలిమా గుణతో కలిసి శనివారం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం గర్వించేలా రూపుదిద్దుకున్న యాదగిరిగుట్ట ఆలయాన్ని దర్శించుకోవడం ఆనందంగా ఉన్నదన్నారు. ఆలయాన్ని ఇంత గొప్పగా తీర్చిదిద్దినందుకు కళాభిమానిగా ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. నిర్మాత దిల్రాజు సహకారంతో దిగ్విజయంగా ‘శాకుంతలం’ సినిమాను పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయని చెప్పారు. ఏప్రిల్ 14న విడుదల చేయనున్నట్లు తెలిపారు. నిర్మాత నీలిమా గుణ మాట్లాడుతూ చిన్నతనంలో చూసిన ఆలయానికి, ప్రస్తుత అలయానికి ఎంతో తేడా ఉన్నదన్నారు. ఆలయాన్ని మహాద్భుతంగా రూపొందించిన సీఎం కేసీఆర్కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ‘శాకుంతలం’ సినిమాను ప్రతిఒక్కరూ ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.