బాలీవుడ్ దిగ్గజం నటుడు దిలీప్ కుమార్ మరోసారి అనారోగ్యం పాలయిన సంగతి తెలిసిందే. రెండు రోజులుగా ఆయన ముంబైలోని హిందూజా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. శ్వాసకోశ సమస్యలతో 98 ఏళ్ల దిలీప్ కుమార్ ఆస్పత్రిలో చేరారు. గత ఏడాది ఆయన ఇద్దరు తమ్ముళ్ళు మరణించారు. దాంతో అప్పటి నుంచి దిలీప్ కుమార్ ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది. మూడు రోజుల కింద ఉన్నట్టుండి శ్వాసకోస సమస్యలు రావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఇంటెన్సివ్ కేర్ కి తరలించి ఆక్సిజన్ సపోర్ట్ అమర్చారు. ఆస్పత్రిలో చేరిన కొన్ని గంటల్లోనే మళ్లీ మామూలు స్థితికి వచ్చేసారు దిలీప్ కుమార్. ఈ విషయాన్ని అక్కడి వైద్యులు అధికారికంగా ప్రకటించారు.
సోషల్ మీడియాలో మాత్రం దిలీప్ కుమార్ ఆరోగ్యం విషమించింది అంటూ తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఆయన భార్య సైరా బాను ఈ లెజెండరీ నటుడు ఆరోగ్యం గురించి ఒక ట్వీట్ చేశారు. బయట వస్తున్న వార్తలను అసలు నమ్మవద్దు అంటూ అభిమానులను ఆమె కోరారు. మీ అందరి కోహినూర్, తన భర్త దిలీప్ కుమార్ ఆరోగ్యం బాగుందని.. ఆయన కోలుకుంటున్నారని త్వరలోనే డిశ్చార్జ్ కూడా అవుతారు అంటూ ఆమె ట్వీట్ చేశారు. దిలీప్ కుమార్ ఆరోగ్యం గురించి ప్రార్థించిన అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం బయట పరిస్థితులు బాగా లేవు కాబట్టి అందరూ ఇళ్ళలో ఉండి ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు సైరా భాను.