తెలుగు సినీ పరిశ్రమలో దాదాపు 300 పై చిలుకు చిత్రాల్లో తనదైన నటనతో నవ్వుల్ని పంచిన హాస్య నటి పావలా శ్యామల ప్రస్తుతం తీవ్ర అనారోగ్య సమస్యలతో దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నది. గత కొంతకాలంగా వృద్ధాప్యంతో పాటు తీవ్రమైన గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న పావలా శ్యామల అత్యవసర చికిత్స నిమిత్తం శుక్రవారం రాత్రి కూకట్పల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లినట్లు తెలిసింది.
చేతిలో తగినంత డబ్బులు లేకపోవడంతో ఆసుపత్రి యాజమాన్యం చికిత్సకు నిరాకరించినట్లుగా సమాచారం. ఆసుపత్రి వారు ఓ ప్రైవేట్ క్యాబ్ను బుక్ చేసి పంపించగా సదరు క్యాబ్ డ్రైవర్ అర్ధరాత్రి ఆమెను కూకట్పల్లి వై జంక్షన్ వద్ద వదిలిపెట్టి వెళ్లాడని తెలిసింది. రోడ్డు పక్కన దయనీయ స్థితిలో ఉన్న ఆమెను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆమెను ‘ఆర్కే ఫౌండేషన్’ అనే స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారని తెలిసింది.
పావలా శ్యామల దీనస్థితిని తెలుసుకున్న అగ్ర నిర్మాత దిల్రాజు ఆమెకు అండగా నిలిచారు. కూకట్పల్లిలోని ప్రసాద్ ఆసుపత్రిలో పావలా శ్యామల చికిత్స పొందుతున్నారని తన సిబ్బంది ద్వారా తెలుసుకున్న దిల్ రాజు.. వైద్యులకు ఫోన్ చేసి ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. పూర్తిస్థాయి చికిత్స కోసం తాను సహాయం చేస్తానని భరోసానిచ్చారు. గతంలో కూడా దిల్రాజు తనను ఆదుకున్నారని, మరోమారు సహాయం అందించినందుకు దిల్రాజుకు పావలా శ్యామల కృతజ్ఞతలు తెలియజేసింది.