Dhurandhar 2 | బాలీవుడ్లో ప్రస్తుతం రణ్వీర్ సింగ్ మేనియా మామూలుగా లేదనే చెప్పాలి. దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన మోస్ట్ అవేటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్: ది రివెంజ్ (Dhurandhar 2)’ విడుదలకు ముందే ఇండియన్ సినిమా ట్రేడ్ను కుదిపేస్తోంది. సినిమాపై ఉన్న విపరీతమైన క్రేజ్ కారణంగా థియేటర్లలో అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ భారీ డిమాండ్ కారణంగా పలు థియేటర్లు ఏకంగా 24 గంటల పాటు షోలు ప్రదర్శించేందుకు సిద్ధమవడం విశేషం. ఈ సినిమా ప్రభావం బాలీవుడ్ చరిత్రలోనే అరుదైన మార్పుకు దారితీసింది. ముంబైలోని ప్రసిద్ధ మరాఠా మందిర్ థియేటర్లో దిల్వాలే దుల్హనియా లే జాయేంగే గత మూడు దశాబ్దాలుగా ప్రతిరోజూ ఉదయం 11:30 గంటలకు ప్రదర్శించబడుతూ వస్తోంది.
కానీ ఇప్పుడు ‘ధురంధర్ 2’ కోసం ఆ ఐకానిక్ టైమింగ్ను మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సినిమా నిడివి దాదాపు 3 గంటల 55 నిమిషాలు ఉండటంతో మరాఠా మందిర్ యాజమాన్యం డీడీఎల్జే షోను ఉదయం 10 గంటలకు మార్చింది. ఒక కొత్త సినిమా కోసం 30 ఏళ్లుగా కొనసాగుతున్న షో టైమింగ్ను మార్చడం ట్రేడ్ వర్గాలను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సినిమా రన్టైమ్ ఎక్కువగా ఉండటం, అలాగే భారీ డిమాండ్ ఉండటంతో మల్టీప్లెక్స్ యాజమాన్యాలు కూడా కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. సాధారణంగా ఒక స్క్రీన్పై రోజుకు నాలుగు షోలు మాత్రమే ప్రదర్శించడం ఆనవాయితీ.
కానీ ఇప్పుడు ముంబై, థానే వంటి ప్రాంతాల్లోని పీవీఆర్ సినిమాస్, మూవీ మ్యాక్స్ సినిమాస్ వంటి మల్టీప్లెక్స్లు అర్ధరాత్రి 1:50 గంటలకే షోలు ప్రారంభించేలా షెడ్యూల్ రూపొందించాయి. అంటే ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు కాదు, 24 గంటల పాటు ‘ధురంధర్ 2’ ప్రదర్శన జరగనుంది. పెయిడ్ ప్రీమియర్స్ పూర్తయ్యాక గురువారం తెల్లవారుజాము నుంచే ఈ పోస్ట్-మిడ్నైట్ షోలు ప్రారంభమవుతాయని సమాచారం. ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ లెక్కలు చూస్తే ట్రేడ్ విశ్లేషకులకే ఆశ్చర్యం కలుగుతోంది. ఇప్పటికే ఓపెనింగ్ వీకెండ్కు సంబంధించి ఇండియాలో 15 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. పెయిడ్ ప్రీమియర్స్, డే-1 షోలు కలుపుకుని కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఇండియాలో రూ.70 కోట్లకు పైగా వసూళ్లు నమోదయ్యాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ.130 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. విడుదలకు ముందే ఈ స్థాయి బిజినెస్ సాధించడం బాలీవుడ్లో అరుదైన విషయంగా భావిస్తున్నారు.