నటీమణులకు భద్రత అనేది అన్నిటికంటే ముఖ్యమని అంటున్నది బాలీవుడ్ నటి డైసీ షా. కెరీర్ ఆరంభంలో ఓ డైరెక్టర్ తనతో అనుచితంగా ప్రవర్తించడంతో ఇండస్ట్రీనే వదిలేయాలని అనుకున్నదట. అనుకోని ఆ సంఘటనతో సెట్స్లో ఉండటమే నరకంలా అనిపించిందని వాపోయింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన కెరీర్ ఆరంభంలో ఎదురైన ఒక చేదు అనుభవాన్ని పంచుకున్నది. సల్మాన్ ఖాన్ సరసన ‘జై హో’ చిత్రంతో బీటౌన్కు పరిచయమైంది డైసీ. అయితే, అంతకుముందు కొన్ని దక్షిణాది సినిమాల్లోనూ నటించింది. అప్పుడే ఓ చిత్ర దర్శకుడు తనపట్ల అనుచితంగా ప్రవర్తించాడని చెప్పుకొచ్చింది. ఆ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేసింది.
“షూటింగ్లో ఒక సన్నివేశాన్ని వివరిస్తున్న నెపంతో.. ఒక దక్షిణాది డైరెక్టర్ నన్ను అసభ్యకరమైన రీతిలో తాకాడు. దాంతో నేను చాలా అసౌకర్యంగా ఫీలయ్యాను. ఆ ఘటన అనుకోకుండా జరిగిందేమీ కాదు. ఆ వ్యక్తి కావాలనే నా గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించాడు. ఆ చేదు అనుభవంతో సినిమాలపైనే ఆసక్తి తగ్గిపోయింది. సెట్స్లో ఉండటమే నరకంలా అనిపించింది” అంటూ గుర్తు చేసుకుంది డైసీ. ఆ దర్శకుడి ప్రవర్తనతో తాను చాలా కుంగిపోయాననీ, నటనకే స్వస్తి చెప్పాలని అనుకున్నానని చెప్పుకొచ్చింది. ఎంతోమంది గౌరవించే సినీ రంగంలో ఇలాంటి మనుషులు ఉంటారని ఊహించలేదని వాపోయింది.
“అలాంటి క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడటం అంత సులభం కాదు. కానీ, ఒక చేదు అనుభవం వల్ల నా కెరీర్ ఆగిపోకూడదని నిర్ణయించుకున్నా. ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుని తిరిగి బాలీవుడ్లో ప్రయత్నాలు మొదలుపెట్టా. సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరో సినిమాలో అవకాశం వచ్చే వరకు పెద్ద పోరాటమే చేశా! ప్రస్తుతం ఎంతో జాగ్రత్తగా ప్రాజెక్టులను ఎంచుకుంటున్నా!” అంటూ గుర్తుచేసుకున్నది. ఇంకా తన వ్యక్తిత్వాన్ని గురించి చెబుతూ.. తనకు ఎవరైనా దగ్గరికి రావడం, తాకడం ఏమాత్రం ఇష్టం ఉండదని చెప్పింది. “ఎవరైనా సరే.. నన్ను తాకడం నాకు ఏమాత్రం నచ్చదు.
అందుకే నేను మసాజ్ కూడా చేయించుకోను. ఒక మహిళ తాకినా ఇష్టం ఉండదు. అలాంటిది ఒక పురుషుడు అలా ప్రవర్తించడంతో నేను వెంటనే అక్కడి నుంచి వచ్చేయాలని నిర్ణయించుకున్నా. ‘మళ్లీ కలుస్తాను’ అని చెప్పి వచ్చేశా. కానీ, అతణ్ని మళ్లీ ఎప్పుడూ కలవనేలేదు” అంటూ వెల్లడించింది. అయితే ఆ దర్శకుడు ఎవరనేది మాత్రం డైసీ బయటపెట్టలేదు. కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య వద్ద అసిస్టెంట్గా కెరీర్ ప్రారంభించింది డైసీ షా. ఎన్నో సినిమాల్లో బ్యాక్గ్రౌండ్ డ్యాన్సర్గా కనిపించింది. కన్నడలో ‘భద్ర’ చిత్రంతో కథానాయికగా పరిచయమైంది. 2014లో సల్మాన్ ఖాన్ సరసన ‘జై హో’ చిత్రంతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. మొదటి చిత్రంతోనే మంచి గుర్తింపు దక్కించుకుంది. తాజాగా, అంజద్ ఖాన్ దర్శకత్వంలో రూపొందిన ‘రెడ్ రూమ్’ అనే వెబ్ సిరీస్లో నటించింది. ప్రస్తుతం పలాష్ ముచ్చల్ దర్శకత్వంలో ఒక థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నది.