Rugby Premier League | నిత్యం సినిమా షూటింగ్స్, సామాజిక సేవా కార్యక్రమాలతో బిజీగా ఉండే మెగాస్టార్ చిరంజీవి ఆదివారం సాయంత్రం కాస్త రిలాక్స్ అయ్యారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన రగ్బీ ప్రీమియర్ లీగ్ (ఆర్పీఎల్) సీజన్-2 ఫైనల్కు ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులను ఉత్సాహపరిచారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి మ్యాచ్ను వీక్షించిన చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వారం రోజులుగా ఉత్కంఠభరితంగా సాగిన ఈ టోర్నీలో హైదరాబాద్ హీరోస్ జట్టు అద్భుత ప్రదర్శనతో చాంపియన్గా అవతరించింది. గత ఏడాది రన్నరప్గా నిలిచిన జట్టు ఈసారి పట్టుదలతో ఆడి టైటిల్ను కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో హైదరాబాద్ హీరోస్ 41-17 తేడాతో ముంబై డ్రీమర్స్పై ఘన విజయం సాధించింది.
ఫైనల్ మ్యాచ్కు ముఖ్య అతిథిగా విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డి విజేతలకు ట్రోఫీని అందజేశారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు రగ్బీ ఇండియా అధ్యక్షుడు, ప్రముఖ బాలీవుడ్ నటుడు రాహుల్ బోస్ ఆటగాళ్లకు పతకాలు ప్రదానం చేశారు. కప్ గెలుచుకున్న హైదరాబాద్ హీరోస్ జట్టుకు రూ.45 లక్షల ప్రైజ్మనీ లభించగా, రన్నరప్ ముంబై డ్రీమర్స్కు రూ.25 లక్షలు అందజేశారు. మూడో స్థానంలో నిలిచిన బెంగళూరు బ్రేవ్ హార్ట్స్ జట్టుకు రూ.15 లక్షల నగదు బహుమతి లభించింది. ఇక మూడో స్థానం కోసం జరిగిన పోరులో బెంగళూరు బ్రేవ్ హార్ట్స్ జట్టు 22-19 తేడాతో చెన్నై బుల్స్పై విజయం సాధించి మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఈ మ్యాచ్ కూడా అభిమానులను ఉత్కంఠకు గురి చేసింది.
ఫైనల్ పోటీకి పలువురు ప్రముఖులు హాజరై ఆటగాళ్లను ప్రోత్సహించారు. స్టార్ షట్లర్ పీవీ సింధు, హీరోయిన్ మృణాల్ ఠాకూర్తో పాటు పలువురు క్రీడా, సినీ ప్రముఖులు గచ్చిబౌలి స్టేడియంలో సందడి చేశారు. ముఖ్యంగా చిరంజీవి హాజరు కావడంతో అభిమానులు భారీ సంఖ్యలో స్టేడియానికి తరలివచ్చారు.క్రీడలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత, సినీ ప్రముఖుల మద్దతు కలిసి రగ్బీ ప్రీమియర్ లీగ్కు మరింత గుర్తింపు తీసుకొచ్చాయని నిర్వాహకులు తెలిపారు. హైదరాబాద్ జట్టు విజయం నగర క్రీడాభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.