కరోనా కేసులు పెరుగుతుండటంతో కొన్ని ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. పాజిటివ్ కేసులు ఎలా అరికట్టాలో తెలియక మరోసారి ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కూడా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన ఈయన ఢిల్లీలో కరోనా కేసులను అదుపు చేయడానికి కొన్ని నియమాలు విడుదల చేశారు. అందులో భాగంగానే జిమ్స్, మాల్స్, షాపులు, ఆడిటోరియమ్స్ అన్ని మూసివేయాలని ఆదేశించారు. మరోవైపు పెళ్లిళ్లకు స్పెషల్ పాసులు ఉండాల్సిందే అని ఆదేశాలు జారీ చేశారు.
ఈ క్రమంలోనే సినిమా థియేటర్లపై కూడా ఈయన ఆంక్షలు విధించారు. ఇకపై ఢిల్లీలో కేవలం 30 శాతం ఆక్యుపెన్సీతోనే సినిమా థియేటర్లు నడిపించాలని ఆంక్షలు విధించారు అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీ సీఎం నిర్ణయంతో థియేటర్ యజమానులు ఆలోచనలో పడ్డారు. కొత్త సినిమాలు విడుదలైన ప్రేక్షకులు థియేటర్ల వైపు రావడం లేదు. ఇలాంటి సమయంలో కేవలం 30 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే ఉండేలా ఆంక్షలు విధించడంతో.. వాటిని మూసుకోవడం తప్ప మరో ఆప్షన్ లేదు అంటున్నారు ఎగ్జిబిటర్లు. సినీ నిర్మాతలు కూడా ఇలాంటి పరిస్థితులలో మూవీని థియేటర్స్లో రిలీజ్ చేయడంపై ఆలోచనలో పడ్డారు.
ప్రస్తుతం పెరుగుతున్న కేసులను అరికట్టాలంటే ఇలాంటి కఠిన నిర్ణయాలు తప్పవని అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. పరిస్థితులు చక్కబడిన తర్వాత మళ్ళీ థియేటర్ల పై ఆంక్షలు తొలగిస్తామని ఆయన మాట ఇచ్చారు. అప్పటి వరకు మాత్రం కేవలం 30 శాతం ఆక్యుపెన్సీతోనే సినిమా హాల్స్ రన్ చేయాలి అంటూ ఆయన ఆదేశించారు. కేవలం ఢిల్లీలోనే కాకుండా కొన్ని రాష్ట్రాలలో ఇప్పటికే థియేటర్ల పై ఆంక్షలు విధించారు. కాకపోతే 30 శాతం కాకుండా 50 శాతం ఆక్యుపెన్సీకి అక్కడ అనుమతులు ఇచ్చారు. తెలుగు రాష్ట్రాలలో కూడా త్వరలోనే ఈ నియమం అమలు అవుతుందని తెలుస్తోంది.