నరేంద్ర, గరిమా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘సీఐ భారతి’. కింగ్డమ్ మూవీస్ పతాకంపై ఘర్షణ శ్రీనివాస్ సమర్పణలో విశాల పసునూరి నిర్మిస్తున్నారు. రమణారెడ్డి గడ్డం దర్శకుడు. ఈ చిత్ర షూటింగ్ ప్రారంభోత్సవం హైదరాబాద్లో కార్మిక శాఖా మంత్రి మల్లారెడ్డి చేతుల మీదుగా జరిగింది. చిత్రబృందానికి మంత్రి స్క్రిప్ట్ అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నటుడు అలీ తొలి షాట్కు క్లాప్నిచ్చారు.
అనంతరం దర్శకుడు రమణారెడ్డి గడ్డం మాట్లాడుతూ…‘గతంలో నేను రెండు చిత్రాలు చేశాను. పవర్ఫుల్ కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. పర్యావరణానికి సంబంధించిన ఒక సమస్యను కూడా ఇందులో ప్రస్తావిస్తున్నాం. ఏప్రిల్ 10వ తేదీ నుంచి సింగిల్ షెడ్యూల్లో సినిమాను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాం’ అని అన్నారు. హీరో నరేంద్ర మాట్లాడుతూ…‘దర్శకుడు మంచి స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు. నా పాత్రను ఆకట్టుకునేలా డిజైన్ చేశారు. విజయవంతమైన చిత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తాం’ అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : శ్రీనివాస రెడ్డి, సంగీతం : ప్రిన్స్ హెన్రీ.