ప్రకృతిని మనం కాపాడుకుంటే మనల్ని ప్రకృతి కాపాడుతుందని అగ్ర కథానాయకుడు చిరంజీవి హితవు పలికారు. నేడు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని చిరంజీవి ఆయనకు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలందజేశారు. గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా ఎంపీ సంతోష్కుమార్ ఆధ్వర్యంలో చేపట్టనున్న ముక్కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చిరంజీవి పిలుపునిచ్చారు. ‘కేటీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు. ఈ శుభ సందర్భంలో మనమంతా మొక్కల్ని నాటి.. వాటిని పరిరక్షించుకుందాం. గ్లోబల్ వార్మింగ్ను అడ్డుకుందాం. ముక్కోటి వృక్షార్చనలో అందరం పాల్గొందాం’ అని చిరంజీవి ట్విట్టర్లో పేర్కొన్నారు.
త్వరలో సెట్స్పైకి ‘లూసిఫర్’
చిరంజీవి కథానాయకుడిగా మోహన్రాజా దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘లూసిఫర్’ రీమేక్ తాలూకు సెట్ నిర్మాణాన్ని శుక్రవారం హైదరాబాద్లో మొదలుపెట్టారు. ఈ సందర్భంగా పూజా కార్యక్రమాల్ని నిర్వహించారు. కథానుగుణంగా ఓ అనాథాశ్రమం సెట్కు రూపకల్పన చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్, ఎన్వీఆర్ సినిమాస్ పతాకాలపై ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. మలయాళంలో విజయం సాధించిన ‘లూసిఫర్’ చిత్రానికి రీమేక్ ఇది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది.