మెగాస్టార్ చిరంజీవి భీమవరంలో ఉన్నారు. ఆయన నటిస్తున్న ‘విశ్వంభర’ చిత్రం తాజా షెడ్యూల్ భీమవరం పరిసరాల్లో జరుగుతున్నది. మామూలుగా చిరంజీవి బయటికొస్తే క్రౌడ్ని కంట్రోల్ చేయడం కష్టం. పైగా తూర్పుగోదావరి జిల్లా. అక్కడి జనాలకు ఆయనంటే అంతులేని అభిమానం. మరి ఆ ఏరియాలో మెగా షెడ్యూలంటే అక్కడి పోలీస్ యంత్రాంగానికి పెద్ద పనే. దొరబాబుగా వింటేజ్ మెగాస్టార్ని జనానికి చూపించటానికి దర్శకుడు మల్లిడి వశిష్ఠ సర్వశక్తులనూ ఒడ్దుతున్నాడు. ఇక్కడ జరిగే షెడ్యూల్లో కథలోని కీలక సన్నివేశాలతోపాటు ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ని కూడా ప్లాన్ చేశారు వశిష్ఠ.
పదిహేనురోజుల పాటు ఈ షెడ్యూల్ ఉంటుందని సమాచారం. ఈ సినిమా కథ, కథనం, చిరంజీవి కేరక్టరైజేషన్ వీటితోపాటు సాంకేతిక హంగులూ అన్నీ కొత్తగా ఉంటాయని సమాచారం. కథ రీత్యా ఇందులో ఇద్దరికంటే ఎక్కువ కథానాయికలు ఉన్న విషయం తెలిసిందే. ఓ కథానాయికగా త్రిష ఇప్పటికే ఎంపికైంది. మరో కథానాయికగా అనుష్క దాదాపు ఖరారైనట్టు సమాచారం. పంచభూతాల నేపథ్యంలో సాగే ఈ ఫాంటసీ సినిమాలో ఊహించని అంశాలుంటాయని వినికిడి. సునీల్ పాత్ర కూడా ఇందులో కొత్తగా ఉంటుందట. ఈ సినిమాకు చెందిన మరిన్ని విషయాలు తెలియాల్సివుంది.