చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. రీ ఎంట్రీ తర్వాత ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా ఒకేసారి నాలుగైదు సినిమాలు కమిట్ అయ్యాడు మెగాస్టార్. వాటిని అంతే వేగంగా పూర్తి చేస్తున్నాడు కూడా. అయితే ఖైదీ నెంబర్ 150 తర్వాత ఆ స్థాయి మాస్ సినిమా చిరంజీవి నుంచి రాలేదు. మధ్యలో వచ్చిన సైరా పీరియాడికల్ సబ్జెక్ట్ అయితే.. మొన్న వచ్చిన ఆచార్య (Acharya) పూర్తిగా నక్సలిజం నేపథ్యంలో సాగింది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయాయి.
మరీ ముఖ్యంగా ఆచార్య సినిమా చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా దాదాపు 60 కోట్ల నష్టాన్ని మిగిల్చింది.ఈ సినిమా తర్వాత చిరంజీవి ఆలోచన విధానం పూర్తిగా మారిపోయింది. ఒకేసారి మూడు నాలుగు సినిమాలు చేస్తున్న అన్నయ్య.. ఇక మీదట అలా చేయకూడదని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఒప్పుకున్న సినిమాలు పూర్తయిన తర్వాతే కొత్త కథలు వినాలని మెగాస్టార్ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది.
ఈ క్రమంలోనే ప్రస్తుతం సెట్స్ పై ఉన్న గాడ్ ఫాదర్ (God Father), వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ సినిమాలపై ఫోకస్ చేయనున్నాడు చిరంజీవి. ఆ తర్వాతే వెంకీ కుడుముల సినిమా గురించి ఆలోచించనున్నాడు. ఈ సినిమా ఆగిపోయింది అంటూ వస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతం చిరంజీవి ఇమేజ్ కు సరిపోయే కథ సిద్ధం చేసే పనిలో వెంకీ బిజీగా ఉన్నాడని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ నాలుగు సినిమాలు పూర్తయిన తర్వాతే మిగిలిన సినిమాలపై దృష్టి పెట్టనున్నాడు అన్నయ్య.
అందుకే ఈ మధ్య కొందరు దర్శకులు కథలు చెప్పాలని ప్రయత్నించినా కూడా సున్నితంగా తిరస్కరించాడు. ఒకేసారి ఎక్కువ సినిమాలు చేయడం వల్ల కన్ఫ్యూజన్ తప్ప ఇంకేమీ ఉండదని మెగాస్టార్ భావిస్తున్నాడట. మొత్తానికి చిరంజీవిలో వచ్చిన ఈ మార్పు రాబోయే సినిమాలపై ఎలాంటి ప్రభావం చూపించబోతుందో చూడాలి.