మెగాస్టార్ చిరంజీవి తనయడు రామ్ చరణ్ .. చిరుత సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. నటనలో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్న రామ్ చరణ్ నిర్మాతగాను కొనసాగుతున్నారు. “ఖైదీ నంబర్ 150”, “సైరా నరసింహా రెడ్డి” వంటి అధిక బడ్జెట్ చిత్రాలతో నిర్మాతగా తానేంటో నిరూపించుకున్నాడు. చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం మరి కొద్ది రోజులలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజాగా రామ్ చరణ్కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. రామ్ చరణ్ త్వరలో ఒక న్యూస్ ఛానెల్ కొనుగోలు చేయబోతున్నాడని, కొన్నాళ్లుగా నష్టాలలో ఉన్న ఆ ఛానెల్ని దక్కించుకొని తాను డెవలప్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడని జోరుగా ప్రచారం జరుగుతుంది.
రామ్ చరణ్ ఈ ఛానెల్ కోసం లాభదాయకమైన ఆఫర్ ను ఇచ్చారట. దీనికి సంబంధించిన చర్చలు చివరి దశలో ఉన్నాయని, అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ఈ ఛానెల్ త్వరలో చేతులు మారవచ్చు అంటున్నారు. మరోవైపు తన బాబాయి పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకు మద్దతుగా ఉండేందుకు కూడా ఈ ఛానెల్ని దక్కించుకోబోతున్నట్టు జోరుగా ప్రచారం నడుస్తుంది. మరి ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.