స్వార్ధ ప్రయోజనాలతోనే కొందరు చిత్రపురి హౌసింగ్ సొసైటీపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ అభివృద్దిని అడ్డుకుంటున్నారని అన్నారు వల్లభనేని అనిల్. లబ్ధిదారులకు ఫ్లాట్స్ కేటాయించే హక్కు ప్రభుత్వం నిర్దేశించిన కమిటీకే ఉంటుందని, ఆ విషయంలో హౌసింగ్ సొసైటీకి ఎలాంటి అధికారం లేదని ఆయన అన్నారు. తమపై వస్తోన్న అవినీతి, ఆరోపణలపై చిత్రపురి హౌసింగ్ సొసైటీ శనివారం స్పందించింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ మాట్లాడుతూ ‘2020 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో ఎంతో మంది పెద్దలు పోటీచేసినా మేము మాత్రమే న్యాయంగా పనిచేయగలమనే నమ్మకంతో చిత్రపురి కాలనీసభ్యులు మమ్మల్ని గెలిపించారు. కాలనీ అభివృద్ధి కోసం మేము కృషిచేస్తుంటే కొందరు ఆటంకాల్ని సృష్టిస్తూ మా పనుల్ని అడ్డుకుంటున్నారు. ఇండస్ట్రీలో 24వేల మంది సినీకార్మికులు ఉంటే చిత్రపురిలో కేవలం 4800 సభ్యత్వాలు మాత్రమే ఉన్నాయి. అందరికీ సభ్యత్వం ఇవ్వడం కుదరదు. అందుకే 2016 తర్వాత కొత్త సభ్యత్వాల్ని ఇవ్వడం లేదు. కానీ కస్తూరి శ్రీనివాస్, మద్దినేని రమేష్ లాంటి వాళ్లు వ్యక్తిగత ప్రయోజనాల్ని ఆశించి హౌసింగ్ సొసైటీపై ఆరోపణలు చేస్తున్నారు. వారి వద్ద ఆధారాలు ఉంటే చట్ట ప్రకారం పోరాడాలి కానీ ఇష్టానుసారం మాట్లాడటం తగదు. చిత్రపురిలో జరిగిన అవినీతిని ప్రక్షాళన చేయడానికి ప్రభుత్వం ఓ కమిటీని వేసింది. ఆ రిపోర్ట్ వచ్చే వరకు ఆగకుండా స్వార్థంతో విమర్శలు చేస్తున్నారు. జనరల్ బాడీ మీటింగ్ జరగకుండా అడ్డుకుంటున్నారు. మేము ఎలాంటి తప్పు చేయలేదు. మాపై వచ్చిన ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాదంబరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.