మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన కందికొండ చిన్నప్పుడు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చదువుకునేందుకు మైళ్ల దూరం నడిచి వేళ్లేవారు. సాహిత్యం మీద ఏర్పడిన ప్రేమ ఈ కష్టాల నుంచి సాంత్వన ఇచ్చింది. బాధలను మరిచేలా చేసింది. నర్సంపేటలో ఉండే సినిమా థియేటర్లు, పాఠశాల దగ్గరలోని గ్రంథాలయం ఈ రెండే కందికొండ చిరునామాలు. విరివిగా పుస్తకాలు చదవడం అతని సాహిత్య మేధను పెంచితే, రకరకాల సినిమాలు చూడటం చిత్రరంగం వైపు ఆకర్షించింది.
దర్శకుడు కావాలని..
మహబూబాబాద్లో డిగ్రీ చదువుకున్న కందికొండ ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మే సాహిత్యం, పొలిటికల్ సైన్స్ చదివారు. చదువుకుంటున్న రోజుల నుంచే పాటలు రాయడం అలవాటు చేసుకున్నారు కందికొండ. సినిమాలు చూసిన ప్రభావం, సాహిత్యం చదివిన అనుభవం దర్శకుడు కావాలనే కోరికను ఆయనలో కలిగించాయి. మంచి చిత్రాలను రూపొందించి ప్రేక్షకులకు వినూత్న అనుభూతిని కలిగించాలని ఉవ్విళ్లూరారు. ఆయన ఒకటి అనుకుంటే జీవితం మరో ప్రయాణ మార్గాన్ని సూచించింది. ఆ జీవిత మలుపులోనే పాటల రచయితగా మారారు.
చక్రితో పరిచయం
విద్యార్థిగా ఉన్న సమయంలోనే సంగీత దర్శకుడు చక్రితో కందికొండకు పరిచయం ఏర్పడింది. చక్రి పాటలు పాడటంతో పాటు స్వరాలు సమకూర్చేవారు. కందికొండ బాగా పాటలు రాసేవారు. ఇద్దరూ కలిసి సాహితీ కళాభారతి అనే సంస్థను ఏర్పాటు చేసి సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. చక్రి సంగీత దర్శకుడిగా మారాక కందికొండతో పాటలు రాయించారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘ఇట్లు శ్రావణీ సుబ్రహ్మణ్యం’ చిత్రంలో మళ్లి కూయవే గువ్వా పాట కందికొండకు రచయితగా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. తొలిపాటే సూపర్ హిట్ అవడంతో అవకాశాలు వరుస కట్టాయి. పూరీ జగన్నాథ్ , చక్రి , కందికొండలది తెలుగు పాటల ప్రపంచంలో సూపర్ హిట్ కాంబినేషన్. ఈ కలయికలో ‘ఇడియట్’, ‘అమ్మా నాన్నా ఓ తమిళ అమ్మాయి’, ‘శివమణి’, ‘ఆంధ్రావాలా’, ‘143’, ‘సూపర్’, ‘పోకిరి’ లాంటి చిత్రాల్లో గుర్తుండిపోయే పాటలు రాశారు కందికొండ. ఈ చిత్రాలన్నీ మ్యూజికల్గా ఘన విజయాలు సాధించాయి.
పాటతో రెండు దశాబ్దాల ప్రయాణం
కొత్త సహస్రాబ్దిలో మొదలైన కందికొండ పాటల ప్రయాణం..దాదాపు రెండు దశాబ్దాల పాటు సాగింది. కలంతో విజయవిహారం చేశారాయన. మొత్తంగా తన కెరీర్లో 1300 పాటలకు సాహిత్యాన్ని అందించారు. ‘ఇడియట్’ చిత్రంలో చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే..‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’లో చెన్నై చంద్రమా..‘శివమణి’లో రామా రామా రామ..‘సత్యం’ సినిమాలో మధురమే మధురమే..‘దేశముదురు’ చిత్రంలో నిన్నే నిన్నే ‘మున్నా’లో మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా..లాంటి అనేక పాటలు శ్రోతలకు చిరకాలం గుర్తుండిపోయేలా రాశారు కందికొండ.
తెలంగాణ ఆత్మ బతుకమ్మ
కందికొండ రాసిన బతుకమ్మ పాటలకు దక్కిన ప్రజాదరణ అనూహ్యం. తెలంగాణ జాతి ఆత్మరా బతుకమ్మ అని చాటిన కవి ఆయన. ప్రకృతి అంటేనే బతుకమ్మ, శ్రమజీవుల కష్టంలో బతుకమ్మ అని గొప్పగా వర్ణించారు కందికొండ. ఏటా ఆయన రాసే బతుకమ్మ పాటలకు యూట్యూబ్లో లక్షలాది వ్యూస్ వచ్చేవి. ఆయన రాసిన బతుకమ్మ పాటలు పండగ సమయంలో ఇంటింటా, వీధివీధినా మార్మోగుతుంటాయి. ఆ పాటల్లో, పదాల్లో తెలంగాణ తనం, గుణం, అచ్చంగా, స్వచ్ఛంగా ప్రతిబింబించేది.
సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
ప్రముఖ కవి, గేయ రచయిత కందికొండ మరణం పట్ల ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గత కొద్దికాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న కందికొండ (యాదగిరి) మృతికి సీఎం కేసిఆర్ సంతాపం తెలిపారు. తెలంగాణ సబ్బండ వర్గాల సంస్కృతిని తన పాట ద్వారా అజరామరంగా నిలిపిన వరంగల్లు బిడ్డ కందికొండ మరణం, తెలంగాణ సాహిత్య లోకానికి సబ్బండ వర్గాలకు తీరని లోటని సీఎం అన్నారు. పాటల రచయితగా తెలుగు సినీ సాహిత్య రంగంలో తనదైన ముద్రను సృష్టించిన తెలంగాణ బిడ్డ కందికొండ అని సీఎం కేసిఆర్ స్మరించుకున్నారు. కందికొండను కాపాడుకునేందుకు ప్రభుత్వం పలు ప్రయత్నాలు చేసినా ఫలించకపోవడం దురదృష్టమని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
మంత్రి కేటీఆర్ సంతాపం
ప్రముఖ కవి, గేయ రచయిత కందికొండ యాదగిరి మరణం పట్ల టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే. తారక రామారావు దిగ్భ్రాంతిని తెలిపారు. కందికొండ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. తెలంగాణ సంస్కృతిని తన సాహిత్యం ద్వారా జనసామాన్యానికి తెలిపిన కందికొండ మరణం తెలంగాణకు తీరనిలోటని ఆయన తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. కందికొండ పాటలు తెలంగాణ సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిపోతాయని ఆయన అన్నారు. కందికొండ కుటుంబ సభ్యులకు మంత్రి కేటీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కందికొండ మృతి బాధాకరం: మంత్రి కొప్పుల ఈశ్వర్
ప్రముఖ కవి కందికొండ యాదగిరి మృతి బాధాకరమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఆయన మృతితో తెలంగాణ సమాజం గొప్ప ఉద్యమకారుడిని, గొప్ప ప్రజాకవిని కోల్పోయిందన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.
కందికొండను కోల్పోవడం తీరని లోటు
ఉజ్వల భవిష్యత్తు ఉన్న ప్రముఖ సినీ గేయ రచయిత కందికొండ యాదగిరిని కోల్పోవడం విషాదకరమని సింగరేణి డైరెక్టర్ ఎన్.బలరామ్ అన్నారు. సింగరేణియులందరి తరుఫున వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సింగరేణిపై కందికొండ రాసిని “భూమి పొరల్లో మాగాణి”గొప్ప ఆదరణ పొందిందని, సింగరేణిలో నిర్వహించే వేడుకల్లో దాన్నే అందరం ఆలపిస్తున్నామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
కందికొండ మృతి పట్ల గవర్నర్ తమిళిసై, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, రచయిత సుద్దాల అశోక్ తేజ, గుత్తా సుఖేందర్ రెడ్డి తదితరులు సంతాపం తెలియజేశారు.
ఆత్మీయ మిత్రుడు కందికొండకు శ్రద్ధాంజలి. ‘ఇట్లు శ్రావణీ సుబ్రహ్మణ్యం’ చిత్రంతో ఇద్దరం ఒకేసారి అరంగేట్రం చేశాం. చివరిసారిగా ‘టెంపర్’ చిత్రానికి పాటలు రాశాం. పూరీ జగన్నాథ్, చక్రి కాంబినేషన్లో మేము రాసిన పాటలకు మంచి గుర్తింపు దక్కింది. – గీత రచయిత భాస్కరభట్ల రవికుమార్
కందికొండ లేరన్న వార్తతో గుండె బరువెక్కింది. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. – గాయని స్మిత