తిరుపతి: టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత, హీరో నాగచైతన్య త్వరలో విడాకులు తీసుకోనున్నారే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అంతేగాక నాగచైతన్య నుంచి సమంత రూ.250 కోట్ల భరణం కూడా డిమాండ్ చేస్తున్నదన్న ప్రచారం జోరందుకున్నది. ఈ పుకార్లతో విసుగు చెందిన సమంత.. గత కొన్ని వారాలుగా మీడియాకు కనిపించకుండా హైదరాబాద్కు దూరంగా ఉంటున్నది. ఈ క్రమంలో మనశ్శాంతి కోసం ఆమె శనివారం తెల్లవారుజామున తిరుమలకు వెళ్లింది. వీఐపీ వేళల్లో స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక ప్రార్థనలు చేసింది.
అనంతరం ఆలయ పరిసరాల్లో నడుచుకుంటూ వెళ్తుండగా స్థానిక జర్నలిస్టులు ఆమెను చుట్టుముట్టారు. వారిలో ఓ జర్నలిస్టు సామ్, చైతూల విడాకుల పుకార్ల గురించి ప్రశ్నించాడు. అంతే సమంతలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆ ప్రశ్న అడిగిన జర్నలిస్టుకు పరుషంగా సమాధానం ఇచ్చింది. ‘గుడికి వచ్చీ… బుద్ధుందా..?’ అంటూ ఆ జర్నలిస్టు వైపు తీవ్రంగా చూస్తూ వెళ్లిపోయింది. అంతేకాదు తలలో బ్రెయిన్ ఉందా..? అన్నట్లుగా సంజ్ఞ కూడా చేస్తూ వెళ్లింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
అయితే, ఈ వీడియో సామ్ అభిమానులను అంతగా ఊరడించలేకపోయింది. ఎందుకంటే, మీడియాలో షికార్లు చేస్తున్న విడాకుల పుకార్లపై ఇప్పటికీ సమంతగానీ, నాగచైతన్యగానీ స్పందించకపోవడం వారిలో ఆందోళనను కలిగిస్తోంది. అభిమానులే కాదు, ఇతరులు కూడా వారి విడాకులపై క్లారిటీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏవైనా విభేదాలుంటే పరిష్కరించుకుని ఆ ప్రేమపక్షులు కలిసే ఉండాలని అభిమానులు ఆశపడుతున్నారు. ఈ మేరకు ఆ స్టార్ కపుల్ త్వరలో ఒక బహిరంగ ప్రకటన చేస్తుందని ఎదురుచూస్తున్నారు.