ముంబై : బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటించిన చిత్రం ‘గంగూబాయి కతియావాడి’. ఈ చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానున్నది. చిత్రంపై దాఖలైన రెండు పిటిషన్లను బాంబే హైకోర్టు కొట్టివేసింది. కొట్టి వేసిన పిటిషన్లలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అమీన్ పటేల్, హితేన్ మెహతా దాఖలు చేసిన పిటిషన్లు ఉన్నాయి. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో చిత్రం తెరక్కికింది. కామాటిపురను రెడ్లైన్ ఏరియాగా తప్పుగా చిత్రీకరించారని, చిత్రం పేరును మార్చాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే అమీన్ పటేల్ మంగళవారం బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కామటిపురా ప్రాంతం పేరున సినిమాలో ఉపయోగిస్తే.. ఆ ప్రాంతపు ప్రజల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఐదుశాతం మేర కూడా వ్యభిచారం జరగడం లేదని, కాబట్టి ఈ పేరును సినిమా నుంచి తొలగించాలని, అంతేకాకుండా మాయాపురి, మాయానగరి పేరుగా మార్చుకోవాలని పిటిషన్లో సూచించారు. ఒకవేళ అదే పేరు వాడితే ఆ ప్రాంతపు అమ్మాయిలను వ్యభిచారులుగా గుర్తించే పొరపాటు జరిగే ప్రమాదం ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం చిత్రంపై దాఖలైన రెండు పిటిషన్లు కొట్టివేసింది. గంగూభాయ్ కతియావాడి చిత్రం విషయానికి వస్తే.. రచయిత ఎస్ హుస్సేన్ జైదీ రాసిన ‘మాఫియా క్వీన్ ఆఫ్ ముంబై’ అనే పుస్తకం ఆధారంగా తెరకెక్కింది. 1960లో కామటి పురాను శాసించిన గుంగూబాయ్ పాత్రను అలియాభట్ పోషించింది.