Bollywood | ముంబై సినీ పరిశ్రమను ఇటీవలి పరిణామాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకప్పుడు అండర్వరల్డ్ పేర్లు వినిపించగానే గ్లామర్ ప్రపంచం వణికిపోయేది. ఇప్పుడు కొత్త గ్యాంగ్లు, గుర్తు తెలియని వ్యక్తుల బెదిరింపులు బాలీవుడ్ వర్గాల్లో మళ్లీ భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. గతంలో కొంతమంది సెలబ్రిటీలపై జరిగిన దాడులను వ్యక్తిగత కారణాలుగా భావించినా, ప్రస్తుతం చోటుచేసుకుంటున్న సంఘటనలు మాత్రం మాఫియా తరహా ఒత్తిడులను గుర్తు చేస్తున్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న హీరోలను టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఇటీవల బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్కు వాట్సాప్ ద్వారా వచ్చిన ఓ వాయిస్ మెసేజ్ కలకలం రేపింది. ఆ సందేశంలో డబ్బు డిమాండ్తో పాటు బెదిరింపులు కూడా వినిపించాయని సమాచారం. ఈ ఘటన అనంతరం రణవీర్ సింగ్ పోలీసులను సంప్రదించగా, ముంబై క్రైమ్ బ్రాంచ్ వెంటనే దర్యాప్తు ప్రారంభించింది. ఈ బెదిరింపుల వెనుక ఎవరు ఉన్నారన్న దానిపై అధికారులు డిజిటల్ ఆధారాలను సేకరిస్తున్నారు. అనుమానాస్పద కాల్ ట్రేసింగ్, వాయిస్ అనాలిసిస్ వంటి చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.ఈ పరిణామాల నేపథ్యంలో రణవీర్ నివాసం వద్ద భద్రతను గణనీయంగా పెంచారు. ఆయుధాలతో గార్డులు, అదనపు పోలీసు బలగాల మోహరింపు కారణంగా ఆయన నివసిస్తున్న అపార్ట్మెంట్లోని ఇతర నివాసితులు అసౌకర్యానికి గురవుతున్నట్లు సమాచారం.
పిల్లలు, వృద్ధులు భయపడుతున్నారని అపార్ట్మెంట్ అసోసియేషన్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఒక వ్యక్తి భద్రత కోసం మొత్తం బిల్డింగ్ను హై అలర్ట్ జోన్గా మార్చడం సరైనదేనా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే, వరుసగా స్టార్ హీరోలకు వస్తున్న బెదిరింపులు బాలీవుడ్ షూటింగ్ షెడ్యూళ్లపైనా ప్రభావం చూపుతున్నాయి. అవుట్డోర్ లోకేషన్లలో షూటింగ్లకు నిర్మాతలు వెనుకడుగు వేస్తున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. హీరోల రెమ్యూనరేషన్లతో పాటు భద్రతా ఏర్పాట్ల ఖర్చులు కూడా భారీగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిణామాలన్నింటిపై ముంబై పోలీసులు క్షుణ్ణంగా విచారణ కొనసాగిస్తుండగా, త్వరలోనే అసలు నిందితులు బయటపడతారని అధికార వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి.