మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ కథానాయిక జాక్వెలిన్ ఫెర్నాండేజ్కు బెయిల్ లభించింది. సుఖేష్ చంద్రశేఖర్ ప్రధాన పాత్రధారిగా సాగిన రెండొందల కోట్ల మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్ ప్రమేయం ఉన్నట్లుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నిర్ధారించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆమెను నిందితురాలిగా పేర్కొంటూ ఆగస్ట్ 17న ఈడీ ఛార్జ్షీట్ను దాఖలు చేసింది. ఇప్పటికే పలుమార్లు ఈడీ ముందు విచారణకు హాజరైన ఆమెకు సోమవారం ఊరట లభించింది.
ఢిల్లీ పాటియాలా కోర్టు జాక్వెలిన్కు మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది. ఈ నెల 26న ఆమె కోర్టు ఎదుట హాజరు కావాలని సమన్లు జారీ అయ్యాయి. సోమవారం తన న్యాయవాదితో కలిసి కోర్టుకు హాజరైన జాక్వెలిన్ బెయిల్కు దరఖాస్తు చేసుకుంది. దీనిపై ఈడీ అధికారుల స్పందనను కోరిన కోర్టు ఆమెకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. హౌస్ఫుల్-3, మర్డర్-2, కిక్, బచన్పాండే వంటి చిత్రాల ద్వారా బాలీవుడ్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది జాక్వెలిన్ ఫెర్నాండేజ్.