ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు సతీష్ కౌశిక్ (67)గురువారం ఢిల్లీలో కన్నుమూశారు. హోలీ వేడుకల్లో పాల్గొనేందుకు గురుగ్రామ్లోని స్నేహితుడికి ఇంటికి వెళ్లిన ఆయన తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. 1956లో హర్యానాలో జన్మించిన సతీష్ కౌశిక్ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో థియేటర్ ఆర్టిస్టుగా కెరీర్ను ఆరంభించారు. ‘జానే భీ దో యారో’ చిత్రానికి ఆయన అందించిన సంభాషణలు పాపులర్ అయ్యాయి. అనంతరం ఆయన హిందీ చిత్రసీమలో హాస్య నటుడిగా, రచయితగా, దర్శకనిర్మాతగా రాణించారు. దాదాపు వంద చిత్రాల్లో తనదైన అభినయంతో మెప్పించారు.
‘రూప్ కీ రాణీ చోరోన్ కా రాజా’ ‘ప్రేమ్’ ‘తేరే నామ్’ ‘షాదీ సే పెహ్లే’ వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. మిస్టర్ ఇండియా, రాజాజీ, ఉత్సవ్, సాగర్, బాఘీ 3, దీవానా మస్తానా వంటి చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలకు మంచి గుర్తింపు దక్కింది. రామ్లఖన్, సాజన్ ఛలే ససురాల్ చిత్రాలకు ఉత్తమ హాస్యనటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్నారు. సతీష్ కౌశిక్ మృతిపట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.