న్యూఢిల్లీ : హిందీ సినిమాలు ఇటీవల బాక్సాఫీస్ వద్ద చతికిలపడుతున్న నేపధ్యంలో బీజేపీ జాతీయ ప్రతినిధి సయ్యద్ జాఫర్ ఇస్లాం కీలక వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ స్టార్లు తమ పారితోషికం తగ్గించుకుంటే నిర్మాతలు మంచి సినిమాలపై దృష్టి సారిస్తారని ఆయన సలహా ఇచ్చారు. ఓటీటీ వేదికలు తక్కువ ఖర్చుతో ప్రజలకు నచ్చే కంటెంట్ను అందిస్తున్నాయనే వాస్తవాన్ని సినీ పరిశ్రమ గుర్తించాలని జాఫర్ ట్వీట్ చేశారు.
ఫ్లాప్ల మీద ఫ్లాప్లు ఎదురైనా బాలీవుడ్ స్టార్లు వాస్తవాలను గ్రహించడం లేదని అన్నారు. స్టార్లు హేతుబద్ధంగా రెమ్యూనరేషన్లు తీసుకుంటే నిర్మాతలు దేశం మెచ్చే మంచి సినిమాలు తీయడంపై దృష్టి సారిస్తారని చెప్పుకొచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద సినీ పరిశ్రమగా పేరొందిన బాలీవుడ్ కొవిడ్-19 మహమ్మారి కారణంగా గత రెండేండ్లుగా భారీ కుదుపులకు లోనైంది. కరోనా వైరస్ నుంచి కోలుకున్న అనంతరం పలు సినిమాలు విడుదలైనా అవి బాక్సాఫీస్ వద్ద దారుణ పరాజయాలను మూటగట్టుకున్నాయి. ఈ దుస్ధితికి ఓటీటీలు కారణమని కొందరు పరిశ్రమ ప్రముఖులు చెబుతుండగా కంటెంట్ వైఫల్యమే వసూళ్లపై పెనుప్రభావం చూపుతున్నాయని విమర్శకులు పేర్కొంటున్నారు.
2022 ప్రధమార్ధంలో 20 ప్రముఖ హిందీ సినిమాలు విడుదలైతే వీటిలో ఏకంగా 15కు పైగా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోర్లాపడ్డాయి. అమీర్ఖాన్ లేటెస్ట్ మూవీ లాల్ సింగ్ చడ్డా ఘోర పరాజయం పాలైంది. ఇక అక్షయ్ కుమార్ రక్షాబంధన్, సామ్రాట్ పృధ్వీరాజ్, బచ్చన్ పాండే రణ్వీర్ సింగ్ 83, జయేష్భాయ్ జోర్దార్, రణ్బీర్ కపూర్ నటించిన షంషేరా, బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ సినిమాలు ధకడ్ వంటి పలు భారీ చిత్రాలు దారుణ పరాజయం చవిచూశాయి. ఇక దక్షిణాది నుంచి తెరకెక్కి పాన్ ఇండియా సినిమాలుగా విడుదలైన కేజీఎఫ్ 2, పుష్ప, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలు ఘన విజయం సాధించాయి.