దర్శకుడు శంకర్ సినిమా అంటే దేశవ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో ఉత్సుకత నెలకొని ఉంటుంది. సామాజికాంశాల్ని వాణిజ్య పంథాలో ఆవిష్కరించే ఆయన శైలికి ఎంతో మంది అభిమానులున్నారు. శంకర్ దర్శకత్వంలో రామ్చరణ్ హీరోగా అగ్ర నిర్మాత దిల్రాజు పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మించబోతున్న యాభయ్యవ సినిమాగా ఈ ప్రాజెక్ట్ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సినిమాలో కియారా అద్వాణీ కథానాయికగా నటించబోతున్నట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ‘శనివారం నా జన్మదినం. ఇప్పటివరకు బర్త్డే సందర్భంలో నేను అందుకున్న అత్యుత్తమ బహుమతి ఇదే. ఇంత పెద్ద ప్రాజెక్ట్లో భాగమవడం చాలా ఆనందంగా ఉంది’ అంటూ కియారా అద్వాణీ పేర్కొంది. ‘వినయ విధేయ రామ’ చిత్రంలో రామ్చరణ్ సరసన నటించింది కియారా అద్వాణీ. మూడేళ్ల విరామం తర్వాత ఈ సుందరి తెలుగులో రీఎంట్రీ ఇవ్వబోతుండటం విశేషం. భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్న ఈ సినిమాను సెప్టెంబర్లో సెట్స్మీదకు తీసుకురానున్నారు.