Mithun Chakraborty | బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం కోల్కతాలోని అపోలో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆయన త్వరగా కోలుకొని తిరిగి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే, ఆయన ఆరోగ్యంపై ఆసుపత్రి హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఆయన షూటింగ్ సమయంలో అలసటకు గురయ్యారని, శరీరంలో నీటిశాతం తగ్గడంతో అస్వస్థతకు గురైనట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. తలతిరుగుతున్నట్లుగా అనిపించగా.. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు.
ప్రాథమిక చికిత్స అనంతరం కోలుకున్నారని.. సాయంత్రం భార్యతో సైతం ఫోన్లో మాట్లాడినట్లుగా ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆయన ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని.. వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నట్లుగా పేర్కొన్నాయి. ఆరోగ్య పరిస్థితి సాధారణంగానే ఉందని తెలిపారు. ఆసుపత్రిని ప్రతినిధి మాట్లాడుతూ మిథున్ చక్రవర్తి ఇవాళ ఉదయం ఆసుపత్రిలో జాయిన్ అయ్యారని, వైద్యులు ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారని చెప్పారు. ఎంఆర్ఐ రిపోర్ట్ రావాల్సి ఉందని.. ఆ తర్వాత మరింత సమాచారం ఇస్తామన్నారు. ప్రస్తుతం మిథున్ న్యూరో మెడిసిన్ స్పెషలిస్ట్ సంరక్షణలో ఉన్నట్లుగా తెలిపారు. ఇదిలా ఉండగా.. మిథున్ చక్రవర్తి ‘శాస్త్రి’ సినిమా షూటింగ్ కోసం కోల్కతాలో కొంతకాలంగా ఉంటున్నారు. ఇటీవల ఆయనకు పద్మభూషణ్ అవార్డు దక్కింది.