ముంబై : ప్రముఖ సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు బప్పి లహరి అనారోగ్యంతో ముంబైలో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలు గురువారం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన తనయుడు బప్ప లహరి అమెరికాలో ఉండగా.. ఆయన రాక కోసం ఎదురుచూస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ‘ఇది తమకు చాలా బాధాకరమైన క్షణాలు. మా ప్రియమైన బప్పిదా నిన్న అర్ధరాత్రి స్వర్గానికి వెళ్లారు. లాస్ ఏంజిల్ నుంచి ఆయన కుమారుడు వచ్చాక రేపు ఉదయం అంత్యక్రియలు జరుగుతాయి’ అని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. బప్పి లహరి గత నెలలో ముంబైలోని క్రిటికేర్ ఆసుపత్రిలో చేరారు.
సోమవారం డిశ్చార్జి అయిన ఆయన.. మంగళవారం మళ్లీ ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రి డైరెక్టర్ దీపక్ నంజోషి మాట్లాడుతూ బప్పి లహరి అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (OSA), రీకరెంట్ ఛెస్ట్ ఇన్ఫెక్షన్తో బాధపడ్డారని, ఈ క్రమంలోనే 29 రోజుల పాటు జుహులోని క్రిటికేర్ ఆసుపత్రిలో చేశారని, ఆ తర్వాత కోలుకున్నారని చెప్పారు. 14న ఇంటికి వెళ్లేందుకు వైద్యులు డిశ్చార్జి చేయగా.. ఒక రోజు తర్వాత మళ్లీ ఆరోగ్యం క్షీణించింది. ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించి మృతి చెందారు. గతేడాది ఆయన కరోనా బారినపడ్డ విషయం తెలిసిందే. బప్పి లహరికి భార్య చిత్రాణి, కూతురు రీమా, కుమారుడు బప్ప లహరి ఉన్నారు.