The Kashmir Files | ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాతో బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి సృష్టించిన రికార్డులు అంతా ఇంతా కాదు. చిన్న సినిమాగా రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర కళ్లు చెదిరే కలెక్షన్లు కొల్లగొట్టింది. గతేడాది ఫిబ్రవరి చివరి వారంలో రిలీజైన ఈ సినిమా ఏకంగా రూ.295 కోట్లు కొల్లగొట్టి హిందీ నాట సరికొత్త రికార్డులు నెలకొల్పింది. అయితే ఈ మూవీ ఒక ప్రాపగాండ సినిమా అని, కశ్మీరీ పండిట్ల ఊచకోత గురించి ఒకవైపే చెప్పారని కామెంట్ల్ వచ్చాయి.. ఇక దక్షిణాదిన ఈ సినిమా పెద్దగా ఆడలేదు కానీ.. ఉత్తరాదిన మాత్రం విజయాన్ని నమోదు చేసుకుంది. ఇదిలా ఉండగా.. ఈ మూవీపై బాలీవుడ్ సీనియర్ నటి దాదాసాహెబ్ ఫాల్కే లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు గ్రహీత ఆశా పరేఖ్ (Asha Parekh) సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గోన్న ఆశా పరేఖ్.. ది కాశ్మీర్ ఫైల్స్, ది కేరళ స్టోరీ (2023) సినిమాలపై విమర్శలు గుప్పించింది. ది కశ్మీర్ ఫైల్స్ సినిమాకు దాదాపు రూ. 400 కోట్ల వరకు వచ్చాయని తెలిపింది. కానీ ఈ మూవీతో లాభపడ్డ చిత్ర నిర్మాత జమ్మూలో కనీస సౌకర్యాలు లేకుండా ఇబ్బందులు పడుతున్న కశ్మీరీ హిందూవులకు ఎంత ఆర్థిక సహాయం అందించారో చెప్పాలంటూ ఆశా పరేఖ్ ప్రశ్నించింది. ఇక ఈ మూవీ ద్వారా నిర్మాతలు రూ. 200 కోట్లు సంపాదించారనుకోండి, కాశ్మీరీకి సహాయం చేయడానికి రూ. 50 కోట్లు విరాళంగా ఇచ్చి ఉండవచ్చు. అంటూ ఆశా పరేఖ్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
ఇక కాశ్మీర్ ఫైల్స్ సినిమాకు వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించగా.. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, జీ స్టూడియో ఈ సినిమాను నిర్మించింది. ఇక ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి, పునీత్ ఇస్సార్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషించారు.