విజయ్ ధరణ్ దాట్ల, సిమ్రాన్ గుప్తా, అనన్య నాగళ్ల హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘అన్వేషి’. ఈ చిత్రాన్ని అరుణ శ్రీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై టి.గణపతి రెడ్డి నిర్మిస్తున్నారు. వీజే ఖన్నా దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా మే రెండో వారంలో విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘ఏదో ఏదో కలవరం..’ అనే పాటను హైదరాబాద్లో విడుదల చేశారు. చైతన్ భరద్వాజ్ స్వరపర్చిన ఈ పాటకు చైతన్య వర్మ సాహిత్యాన్ని అందించగా..అనురాగ్ కులకర్ణి, దీప్తి పాడారు.
ఈ పాట విడుదల సందర్భంగా దర్శకుడు వీజే ఖన్నా మాట్లాడుతూ…‘అడవి నేపథ్యంగా సాగే చిత్రమిది. ధరణ్, సిమ్రాన్ జంట ఆకట్టుకుంటుంది. అనన్య నాగళ్ల కథలో కీలక పాత్రను పోషించింది. సినిమాలో సంగీతానికి ప్రాధాన్యత ఉంటుంది. చైతన్ భరద్వాజ్ హిట్ మ్యూజిక్ ఇచ్చారు. ఏదో ఏదో కలవరం పాట చిత్రానికి ఆకర్షణ అవుతుంది’ అన్నారు. నిర్మాత టి. గణపతి రెడ్డి మాట్లాడుతూ…‘మంచి కథ స్క్రీన్ప్లేతో మా సినిమాను నిర్మించాం. ప్రస్తుతం షూటింగ్ పూర్తయింది. మే నెలలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం. మా సంస్థకు పేరే తెచ్చే చిత్రమవుతుందని ఆశిస్తున్నాం’ అన్నారు.