Anushka | లేడీ ఓరియెంటెడ్ పాత్రలో మెప్పించడంలో అగ్ర కథానాయిక అనుష్కది పెట్టింది పేరు. ‘అరుంధతి’, ‘నాగవల్లి’, ‘వేదం’, ‘సైజ్ జీరో’ల్లో విభిన్న పాత్రలతో ఆకట్టుకుంది. ‘పంచాక్షరి, ‘రుద్రమ దేవి’ల్లోనూ టైటిల్ రోల్ చేసింది. అయితే ‘భాగమతి’ చిత్రంలో ఆమె చేసిన మరో టైటిల్ రోల్ పాత్ర పేరుతోనే ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. ఈ అమ్మడు కొత్తగా మరో మహిళా ప్రధాన చిత్రానికి సంతకం చేసింది. దీన్ని దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. తాజాగా ఈ సినిమా షూటింగ్ కోసం అనుష్క ఒడిశాకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆమెకు లభించిన స్వాగతానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తున్నాయి.
‘బాహుబలి’ తర్వాత స్వీటీకి ఇంకా పెద్ద హిట్ పడలేదు. కానీ ఇటీవల ఆమె నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’కి మంచి ఆదరణే దక్కింది. ఈ చిత్రాన్ని ఓ అగ్ర నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నదని సమాచారం. ఇందులో రమ్యకృష్ణ కూడా నటిస్తున్నారని తెలిసింది. మిగతా నటీనటుల గురించి తెలియాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ రూపొందిస్తున్న ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ కొంత భాగం మిగిలి ఉంది. ఈ సినిమాను పూర్తి చేసేందుకు నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్న క్రిష్ దాన్ని పక్కన పెట్టి ఈ లేడీ ఓరియెంటెడ్ కథను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తున్నది. ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.