జన్మతహా మలయాళీ అయినా.. తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసింది అనుపమ పరమేశ్వరన్. ఈ విషయం గురించి ఆమె.. తన తాజా మలయాళ సినిమా ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ ప్రమోషన్స్లో మాట్లాడింది. ‘తెలుగులో ఎక్కువ సినిమాలు చేయడానికీ, మాతృభాష మలయాళంలో తక్కువ సినిమాలు చేయడానికి కారణం లేకపోలేదు. మలయాళం ‘ప్రేమమ్’ సినిమాతో నా కెరీర్ మొదలైంది. తొలినాళ్లలో నన్ను చాలామంది ట్రోల్ చేశారు. నాకు నటనే రాదన్నారు.
ఆ విమర్శలు నాలో కసిని పెంచాయ్. జనానికి నచ్చే సినిమాలే చేయాలని అప్పుడే ఫిక్స్ అయ్యాను. అలాంటి సమయంలో తెలుగులో ఆఫర్లొచ్చాయి. అవి సక్సెస్లు కూడా అయ్యాయి. దాంతో అనుకోకుండానే తెలుగులో ఎక్కువ సినిమాలు చేశా. అన్ని ట్రోల్స్ వచ్చినా.. నాపై నమ్మకంతో ఇన్నాళ్లకు మళ్లీ ‘జానకి వెర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ వంటి గొప్ప సినిమాకు నన్ను ఎంపిక చేశారు దర్శకుడు ప్రవీణ్ నారాయణ్.
నన్ను విమర్శించినవారందరికీ ఈ సినిమా సమాధానమిస్తుంది. ఈ సందర్భంగా నాకు మద్దతు ఇచ్చినవారితోపాటు, నన్ను ద్వేషించినవారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నా.’ అని పేర్కొన్నది అనుపమ పరమేశ్వరన్. ఈ నెల 27న అనుమప ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ సినిమా కేరళలో విడుదల కానుంది. సురేశ్ గోపీ లాయర్గా నటించిన ఈ చిత్రంలో జానకిగా అనుపమ కనిపించనుంది. ‘సత్యం ఎప్పటికైనా విజయం సాధిస్తుంది..’ అనేది ఈ సినిమా ఉపశీర్షిక.