Amitabh congrats Rishi | దీపావళి పండగ రోజున భారతీయులకు మరిచిపోలేని శుభవార్త వినిపించింది. భారత మూలాలున్న రిషి సునక్ బ్రిటన్ ప్రధానిగా ఎన్నికయ్యారు. బ్రిటన్లో శ్వేతజాతీయేతర వ్యక్తి ప్రధానమంత్రిగా ఎన్నికవడం ఇదే తొలిసారి. సునక్ బ్రిటన్ ప్రధాని కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రపంచం నలుమూలల నుంచి ప్రముఖులు రిషిని అభినందిస్తున్నారు. అయితే, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మాత్రం అందరికంటే భిన్నంగా రిషికి శుభాకాంక్షలు తెలిపి ప్రత్యేకంగా నిలిచారు. రిషి సునక్ ప్రధాని కావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ.. తాను రాసిన పోస్ట్ను సోషల్ మీడియాలో అమితాబ్ షేర్ చేశారు. ‘భారత్ మాతా కీ జై. ఇప్పుడు బ్రిటన్ కొత్త వైస్రాయ్ను ప్రధానమంత్రిగా కలిగి ఉన్నది’ అని ట్విట్టర్లో రిషి సునక్ను అభినందిస్తూ అమితాబ్ రాశారు.
నిజానికి, బ్రిటీష్ వారు 200 సంవత్సరాలపాటు భారత్ను పాలించిన తర్వాత 1947లో బ్రిటన్కు వెళ్తూ వెళ్తూ మన దేశంలో వైస్రాయ్ను ఏర్పాటు చేశారు. అమితాబ్ పోస్ట్లో దాగి ఉన్న విషయాన్ని తెలుసుకున్న వారు ఈ పోస్ట్పై ఘాటుగా స్పందిస్తున్నారు. 200 ఏండ్ల బానిసత్వం నేడు ప్రతీకారం తీర్చుకున్నదని ఓ నెటిజెన్ కామెంట్ చేశాడు. కాలికి గాయంతో బాధపడుతున్న బిగ్ బీ.. కాలికి కట్టుతో ఉన్న ఫొటోలను షేర్ చేయడంతో అమితాబ్ అభిమానులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అమితాబ్ బచ్చన్ తరచుగా అర్థవంతమైన సందేశాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.