కొందరు వ్యాపారులు తన పేరును దుర్వినియోగం చేస్తున్నారంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్. బిగ్ బీ తరపున న్యాయవాదులు హరీష్ సాల్వే, ప్రవీణ్ ఆనంద్ పిటిషన్ దాఖలు చేసి సమస్యను న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. అమితాబ్ అనుమతి లేకుండా కొందరు ఓ వైబ్ సైట్ను, వీడియో కాలింగ్ యాప్ను, లాటరీని నిర్వహిస్తున్నారని, అమితాబ్ ఫొటోలను ముద్రించిన దుస్తులను విక్రయిస్తున్నారని లాయర్స్ కోర్టుకు తెలిపారు.
వారి వాదనలను విన్న న్యాయస్థానం అమితాబ్ అనుమతి లేకుండా ఆయన పేరును ఎవరూ వాడకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఆయన పేరును ఏ వ్యాపార ప్రచారానికి, వస్తువుల అమ్మకానికి వాడకూడదని కోర్టు పేర్కొంది. గతంలోనూ అమితాబ్ ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు. కొన్ని టీవీ కార్యక్రమాల్లో, ప్రకటనల్లో ఆయన గొంతును అనుకరించడం పైనా వివాదాలు వచ్చాయి. ఇటీవలే ‘ఉంఛాయి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారీ దిగ్గజ నటుడు. ప్రస్తుతం ఆయన ఖాతాలో పలు ఆసక్తికర చిత్రాలున్నాయి.