బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్ ఇటీవల షూటింగ్లో గాయపడ్డాడు. రెండేండ్ల కింద తమిళంలో విడుదలైన హిట్ చిత్రం ‘ఒత్తు సెరెప్పు సైజ్ 7’ సినిమాను అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్రలో పార్తిబన్ రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్లోనే అభిషేక్ గాయపడ్డాడు. దీంతో ఆయన్ను వెంటనే ముంబై లీలావతి హాస్పిటల్కు తరలించారు. ఆయన కుడి చేతికి గాయం కావడంతో అక్కడ చికిత్స అందిస్తున్నారు. అయితే, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అభిషేక్ను చూసేందుకు ఇప్పటివరకు ఐశ్వర్యరాయ్ వెళ్లలేదని తెలుస్తోంది. దీంతో వీరి రిలేషన్పై సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు వస్తున్నాయి.
అభిషేక్ బచ్చన్కు జరిగిన ప్రమాదం గురించి ఇప్పటివరకు బచ్చన్ ఫ్యామిలీ ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు. కానీ కొడుకును చూసేందుకు శ్వేతా నందతో కలిసి అమితాబ్ బచ్చన్.. లీలావతి హాస్పిటల్కు వెళ్లిన ఫొటో ఒకటి ఇప్పుడు వైరల్గా మారింది. ఈ ఫొటోలు బయటకు రావడంతోనే అభిషేక్ బచ్చన్కు యాక్సిడెంట్ జరిగిన విషయం అందరికీ తెలిసింది. హాస్పిటల్ దగ్గరి ఫొటోల్లో బిగ్బి మాత్రమే ఉన్నాడు. అందులో ఐశ్వర్యరాయ్ ఎక్కడా కనిపించడం లేదు. దీంతో సోషల్ మీడియాలో పలు పుకార్లు వస్తున్నాయి. భర్త హాస్పిటల్లో ఉంటే భార్య చూడడానికి రాకపోవడం ఏంటి అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇద్దరి మధ్య అంతా బాగానే ఉందా.. లేదంటే ఏదైనా గొడవలు జరుగుతున్నాయా అంటూ కొత్త కొత్త అనుమానాలకు తెర తీస్తున్నారు. అసలు అభిషేక్ను చూడటానికి ఐశ్వర్య రాయ్ ఎందుకు హాస్పిటల్కు రాలేదు అంటూ కామెంట్ చేస్తున్నారు. దీనికి సమాధానం ఆమె సినిమా షూటింగ్తో బిజీగా ఉండటమే అనే సమాధానం కూడా వినిపిస్తుంది.
ప్రస్తుతం మణిరత్నం తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ పొన్నియన్ సెల్వన్ అనే సినిమాలో నటిస్తోంది ఐశ్వర్య రాయ్. ఇందులో కార్తి, విక్రమ్, జయం రవి లాంటి భారీ స్టార్స్ నటిస్తున్నారు. ఇంత మంది డేట్స్ ఒకేసారి దొరకడం చాలా కష్టం. అందుకే ఈ సినిమా షెడ్యూల్లోకి ఒకసారి ఎంటర్ అయిన తర్వాత పూర్తయ్యాక మళ్లీ బయటికి వస్తున్నారు అందులో నటిస్తున్న స్టార్స్. అలా ఐశ్వర్య రాయ్ కూడా ఈ షూటింగ్లో ఇరుక్కుపోయింది. ప్రస్తుతం ఆమె బయటికి వచ్చే పరిస్థితుల్లో లేరు. అందుకే అభిషేక్ బచ్చన్ హాస్పిటల్లో ఉన్నా కూడా చూడటానికి రాలేదు. కానీ అంతలోనే ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది.