Allu Arjun | ‘పుష్ప’ ఫ్రాంచైజీ తర్వాత అల్లు అర్జున్ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. బన్నీ విషయంలో దేశవ్యాప్తంగా ఉన్న లెజెండరీ యాక్టర్ల దృక్కోణంలో కూడా మార్పు వచ్చింది. జాతీయ ఉత్తమనటుడిగా ఎంపిక కావడం, లెజెండ్ అమితాబ్ సైతం బన్నీని పొగడటం ఇవ్వన్నీ కూడా అందుకు కారణాలు కావొచ్చు. దేశంలో వందలకోట్లతో నిర్మించే భారీ ప్రాజెక్టులన్నీ ఇప్పుడు బన్నీవైపు చూస్తున్నాయి. రీసెంట్గా అట్లీ సినిమా పనిమీద ముంబయ్ వెళ్లిన బన్నీనీ.. బాలీవుడ్ స్టార్ అమీర్ఖాన్ కలిశారు. ఇది పూర్తిగా ప్రొఫెనల్ మీటింగ్ అని తెలుస్తున్నది. అమీర్ఖాన్ తన ‘మహాభారతం’ ప్రాజెక్ట్ కోసమే అల్లు అర్జున్ని కలిశారని బీటౌన్ టాక్. ఇందులో శ్రీకృష్ణుడిగా తానే నటిస్తానని ఆమీర్ఖాన్ గతంలోనే ప్రకటించారు. ఈ ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్లో అర్జునుడి పాత్రను బన్నీతో చేయించాలని అమీర్ఖాన్ భావిస్తున్నారట. అందుకే బన్నీని ఆయన కలిశారట.
ఈ సినిమాను ఐదు భాగాలుగా తీయాలనేది అమీర్ డ్రీమ్. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. తొలి భాగాన్ని సంజయ్లీలా బన్సాలీ దర్శకత్వం వహిస్తారట. ఈ మధ్యకాలంలో సంజయ్ కూడా ఒకట్రెండుసార్లు ముంబయ్లో బన్నీని కలిశారు. దీంతో ‘మహాభారత్’ ప్రాజెక్ట్ కోసమే ఈ మీటింగులని తెలుస్తున్నది. అల్లు అర్జున్తో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ పౌరాణిక చిత్రాన్ని నిర్మించనున్నట్టు సదరు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఇటీవల ప్రకటించారు. అమీర్ఖాన్ స్పీడ్ చూస్తుంటే.. దానికంటే ముందే.. ‘మహాభారతం’లో బన్నీ అర్జునుడిగా పౌరాణిక పాత్రలో కనిపిస్తాడేమోనని పలువురు అభిప్రాయపడుతున్నారు. దక్షిణాదికి చెందిన అగ్ర నటుల్ని ఈ ప్రాజెక్టులో భాగస్వాముల్ని చేయాలని అమీర్ భావిస్తున్నారట. ఇందులోని వివిధ పాత్రలకు సౌత్ నుంచి మరికొందరు హీరోలను కూడాతీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.