Akshay Kumar | బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తాజాగా ఒక కార్యక్రమంలో తన తండ్రి హరి ఓం భాటియాను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ప్రోస్టేట్ క్యాన్సర్ కారణంగా 2000 సంవత్సరంలో తన తండ్రి మరణించిన విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ, పురుషులు ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టాలని సూచించారు. అక్షయ్ కుమార్ మాట్లాడుతూ, తన తండ్రి 67 సంవత్సరాల వయసులో ప్రోస్టేట్ క్యాన్సర్ కారణంగా మరణించారని తెలిపారు. ఆ సమయంలో సాధారణ వైద్య పరీక్షలు, స్క్రీనింగ్ టెస్టుల ప్రాముఖ్యత గురించి తమకు సరైన అవగాహన లేకపోవడమే పెద్ద కారణమని ఆయన అన్నారు. ముఖ్యంగా 50-55 సంవత్సరాల తర్వాత ప్రతి పురుషుడు తప్పనిసరిగా ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ (PSA) పరీక్ష చేయించుకోవాలని ఆయన సూచించారు.
కొన్నేళ్ల క్రితం నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి అయిన మా నాన్నను కోల్పోయాను. ఆయన నాకు జీవితాన్ని ఇచ్చిన వ్యక్తి. కానీ ఆ సమయంలో సాధారణ పరీక్షల ప్రాముఖ్యత గురించి మాకు పెద్దగా తెలియదు. ముఖ్యంగా 50 సంవత్సరాల తర్వాత PSA పరీక్ష చేయించుకోవడం ఎంత ముఖ్యమో తెలియలే అని అక్షయ్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. అలాగే ప్రతి సంవత్సరం PSA పరీక్ష చేయించుకోవడం వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ను ప్రారంభ దశలోనే గుర్తించే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. ముందుగానే వ్యాధిని గుర్తిస్తే చికిత్స సులభమై ప్రాణాలను కాపాడవచ్చని చెప్పారు.
ప్రస్తుతం ప్రోస్టేట్ క్యాన్సర్ సాధారణంగా కనిపించే వ్యాధిగా మారిందని అక్షయ్ పేర్కొన్నారు. ప్రతి ముగ్గురిలో ఒకరికి ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని, అందుకే పురుషులు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు. సకాలంలో పరీక్షలు చేయించుకుంటే మీ ప్రాణాలను మాత్రమే కాదు, మీ కుటుంబ సభ్యుల ఆనందాన్ని కూడా కాపాడగలుగుతారు. అందుకే ప్రతి పురుషుడు PSA పరీక్షను తప్పనిసరిగా చేయించుకోవాలి” అని అక్షయ్ తన అభిమానులకు పిలుపునిచ్చారు. ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ (PSA) అనేది ప్రోస్టేట్ గ్రంథి కణాలు ఉత్పత్తి చేసే ఒక ప్రోటీన్. PSA రక్త పరీక్ష ద్వారా రక్తంలో ఈ ప్రోటీన్ స్థాయిని కొలుస్తారు. ఈ పరీక్ష ప్రధానంగా ప్రోస్టేట్ క్యాన్సర్ను ముందుగానే గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ప్రారంభ దశలోనే వ్యాధిని గుర్తిస్తే చికిత్స విజయవంతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.