కోలీవుడ్ (Kollywood) అగ్ర హీరోల్లో ఒకరు అజిత్ (Ajithkumar). అత్యధిక పారితోషికం తీసుకుంటున్న తమిళ హీరోల్లో తొలి ఐదుగురిలో ఉంటారాయన. ఈ స్టార్ చిత్రపరిశ్రమలో అడుగుపెట్టి 30 ఏళ్లవుతున్నది. 1990లో ఎన్ వీడు ఎన్ కనవర్ (En Veedu En Kanavar) చిత్రంతో బాల నటుడిగా వెండితెరకు పరిచయం అయ్యారు అజిత్. స్కూల్ విద్యార్థి పాత్రలో కనిపించడం ద్వారా అరంగేట్రం చేశారు. అయితే హీరోగా నటించింది మాత్రం 1993లో ప్రేక్షకుల ముందుకొచ్చిన అమరావతి అనే చిత్రంతో. ఈ సినిమాలో నాయికగా సంఘవి నటించింది. అమరావతి హీరోగా తొలి చిత్రం కాబట్టి అజిత్ కెరీర్ కూడా ఇక్కడి నుంచే లెక్కిస్తుంటారు అభిమానులు.
ఎస్పీ బాలు కుటుంబంతో ఉన్న పరిచయంతో తొలి చిత్రంలో అవకాశం దక్కించుకున్న అజిత్..ఆ తర్వాత చూడగానే ఆకట్టుకునే రూపంతో ఇండస్ట్రీని ఆకర్షించాడు. కాదల్ కొట్టై, అవల్ వరువాల, కాదల్ మన్నన్ లాంటి చిత్రాలతో తమిళ తెరపై రొమాంటిక్ హీరోగా ఎదిగాడు. ఆ తర్వాత యాక్షన్ హీరోగా ఎదిగే ప్రయత్నం చేశాడు. అమరకాలం, వాలి చిత్రాలు ఘన విజయాలు సాధించి అజిత్ క్రేజ్ ను మరింత పెంచాయి. బిల్లా, మంగాత చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించి రికార్డులు సృష్టించాయి. ఇలా అజిత్ కెరీర్ సూపర్ స్టార్ డమ్ కు చేరుకుంది.
నటుడిగా 30వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా అజిత్ ఓ సందేశాన్ని సోషల్ మీడియా ద్వారా పంపించాడు. ‘అభిమానులు, ద్వేషించేవారు, స్థిరంగా తమ అభిప్రాయాలు చెప్పేవాళ్లు ఈ ముగ్గురు ఒకే నాణేనికి ఉండే మూడు ముఖాల్లాంటివారు. అభిమానుల ప్రేమను ప్రేమతో స్వీకరిస్తున్నా, అలాగే ద్వేషాన్ని తీసుకోగలను, పక్షపాతం లేకుండా న్యూట్రల్ గా ఉండేవారి అభిప్రాయాలను గౌరవిస్తా. ‘అని మెసేజ్ పంపాడు.
ఇది అజిత్ మేనేజర్ సురేష్ చంద్ర ద్వారా ట్వీట్ చేయించాడు. ఇటీవల వాలిమై సినిమా అపజయం పాలైన నేపథ్యంలో విమర్శలు ఎదుర్కొన్నారు అజిత్. అలా విమర్శించిన వాళ్ల కోసమే ఈ ట్వీట్ చేయించాడని అనుకుంటున్నారు.