కేంద్రంతో టాస్క్ఫోర్స్ కమిటీ సంప్రదింపులు
విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి
హుజూర్నగర్, మే 17 : ‘కొవిడ్ పరీక్షలు, వ్యాక్సిన్ సరఫరా అన్నది కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిది.. ఐసీఎంఆర్ నిబంధనలను దాటి ముందుకుపోలేని పరిస్థితి ఉంది. అయినా సీఎం కేసీఆర్ గ్లోబల్ టెండర్లకు అనుమతులు కోరారు. ఇందుకోసం మంత్రి కేటీఆర్ అధ్యక్షతన టాస్క్ఫోర్స్ కమిటీని వేశారు. ఆ కమిటీ త్వరలో విధివిధానాలను ఇవ్వనున్నది’ అని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ ఏరియా దవాఖానలో సోమవారం ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అధ్యక్షతన సోమవారం కొవిడ్పై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. అంతకు ముందు సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంత్రి రెండో విడుత జ్వర సర్వేను ప్రారంభించారు. మంత్రికి వైద్యసిబ్బంది పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా జగదీశ్రెడ్డి మాట్లాడుతూ.. టాస్క్ఫోర్స్ కమిటీ కేంద్ర ప్రభుత్వంతో సంప్రదిస్తున్నదని, విధి విధానాలు రాగానే అందరికీ వ్యాక్సిన్ వేస్తామని తెలిపారు. మెరుగైన వైద్యం అందజేసేందుకు సీఎం కేసీఆర్ నిరంతరం సమీక్షిస్తున్నారన్నారు.