ఇటీవల ‘పొన్నియన్ సెల్వన్ 2’ చిత్రంతో ఘన విజయాన్ని అందుకుంది బాలీవుడ్ నాయిక ఐశ్వర్యరాయ్. ఈ చిత్రంలోని నందిని పాత్రలో ఆమెకు మంచి పేరొచ్చింది. ఇలాంటి పేరు తెచ్చే క్యారెక్టర్స్ బాలీవుడ్లో మీరెందుకు చేయడం లేదు అనే ప్రశ్న తాజాగా ఐశ్వర్యకు ఎదురైంది. ప్రస్తుతం కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో పాల్గొంటున్నదీ అందాల తార. అక్కడ ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ…‘నేను బాలీవుడ్లో ఎక్కువ చిత్రాల్లో ఎందుకు నటించడం లేదని తరుచూ అడుగుతుంటారు. నేను కీలకమైన పాత్రల్లో నటించాలని మీరంతా కోరుకుంటున్నారని భావిస్తున్నా. అందుకే ఈ ప్రశ్న నన్ను అడుగుతున్నారు.
ఒక నటిగా నా ప్రతిభను గుర్తిస్తూ మీరు ఇలా అడగటమే ఒక అవార్డ్గా భావిస్తా. సినిమా ఇండస్ట్రీ సృజనాత్మక ప్రపంచం. అప్పటికి ప్రేక్షకులకు ఏం నచ్చుతుందో, ఏది మంచిది అనిపిస్తుందో ఆ నిర్ణయాలే తీసుకుంటారు. ఇక దర్శకుడు మణిరత్నం నటిగా నన్ను ఎప్పుడూ ప్రోత్సహిస్తుంటారు. ఇది నువ్వు చేయగలవు అంటుంటారు. ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రంలో నటిస్తున్నప్పుడు ఒక విద్యార్థిలా ప్రతి డైలాగ్ రాసుకుని నేర్చుకున్నాను’ అని చెప్పింది. 2010 నుంచి హిందీలో సినిమాలు తగ్గించుకుంది ఐశ్వర్య. 2018లో రిలీజైన ‘ఫ్యానే ఖాన్’ సినిమా తర్వాత ఆమె హిందీలో నటించలేదు.